తెలంగాణ రాష్ట్రం లో ఉత్పత్తి అవుతున్న వేరుశనగ ముoబయి, ఢిల్లీ లలో ఉండే దళారులు, మధ్యవర్తుల ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. దీంతో రైతుకు సరైన లాభం కలగడం లేదు. ట్రేడర్స్ మాత్రమే లాభపడుతున్నారు. అలా కాకుండా నేరుగా (Direct Trading Promotion) విదేశాలకు వేరుశనగ ఎగుమతి చేస్తాం అని అయిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. అమ్ స్టర్ డామ్ లో పర్యటనలో ఉన్న మంత్రి అక్కడ నెదర్లాండ్స్ కొనుగోలు దారులతో సమావేశం అయ్యారు. 1980 తరువాత వేరుశనగ విత్తనాలలో అఫ్లోటాక్సిన్ ప్రభావం మూలంగా ఎగుమతులు గణనీయంగా తగ్గాయని ఆయన అన్నారు. అందువల్ల ప్రస్తుతం అప్లోటాక్సిన్ ప్రభావం లేని వేరుశనగను ఉత్పత్తి చేస్తున్నామని ఆయన వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా వేరుశనగ మార్కెట్ విలువ సంవత్సరానికి దాదాపు 1 బిలియన్ డాలర్లు ఉంటుందని, వేరుశనగను యూరోపేయన్ యూనియన్ దేశాలు, ఇండోనేసియా, కెనడా, సింగపూర్, మలేసియా, ఫిలిపైన్స్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు. జర్మనీ, నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా శనివారం వేరుశనగ దిగుమతి దారులు, కూరగాయల విత్తనోత్పత్తి చేసే కంపెనీలతో ప్రత్యేకంగా మంత్రి సమావేశం అయ్యారు. ఆయనతో బాటు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు, విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు ఉన్నారు. కూరగాయ పంటల విత్తనోత్పత్తిలో రైతుకు ఎక్కువ లాభం చేకూరుతుందని, యూరప్ లో పేరొందిన కొన్ని కూరగాయల విత్తన కంపెనీలు హైదరబాద్ లో ఉన్నాయని మంత్రి తెలిపారు. విత్తనోత్పత్తిని చేపడితే తెలంగాణ రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని, తెలంగాణలోని పలు జిల్లాలు విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మల్టీ నేషనల్ విత్తన కంపెనీలచే తెలంగాణలో పందిరి జాతి, మిరప, బెండ, వంకాయ కూరగాయల విత్తనోత్పత్తిని చేపట్టి, ఎగుమతులను ప్రోత్సహిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
previous post