ఎన్నికల అక్రమాలకు పాల్పడుతున్న జగన్ సర్కార్ పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీలో ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకొని వచ్చాం ఇక అక్రమాలు సాగనివ్వం అని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. మరీ ముఖ్యంగా విజయవాడ, తిరుపతి, అనంతపురం అధికారులపై వారు సీరియస్ అయ్యారు. ఫిర్యాదులు వచ్చినా కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంపై అధికారులను కూడా ఈసీ నిలదీసింది. రాజకీయ ఒత్తిడులకు తలొగ్గే పనైతే తప్పుకోవాలని అధికారులకు వారు సూచించారు. రాజకీయ పార్టీలతో అనుబంధం ఉంటే కూడా తప్పుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ఏ అధికారి ఎలా ఉన్నారో మా దగ్గర రిపోర్ట్ ఉంది. మాకు తెలియదని మీకు అనుకోవద్దని హెచ్చరించారు.
మద్యం, డబ్బు పంపిణీ నియంత్రణకు చేపట్టిన చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీ నుంచి ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయని అధికారులపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఫామ్-7లు పరిశీలనపై EROలు, ఇతర అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్ వచ్చేలోగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అధికారులు వివరణ ఇస్తుండగా పలు సందర్భాల్లో జోక్యం చేసుకుని చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులను ప్రశ్నించారు. కొందరు అధికారుల తీరుపై కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.