ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసమే అంటే అది అతిశయోక్తి కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దేశంపై తన పట్టును నిలుపుకోవాలంటే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి గెలవాలి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి తన అధికారాన్ని కోల్పోవాలని దేశంలోని విపక్షాలన్నీ కోరుకుంటున్నాయి.
ఉత్తర ప్రదేశ్ లో బిజెపి అధికారం కోల్పోతే ఇక ప్రతిపక్షాలు విజృంభిస్తాయి. అయితే ఉత్తర ప్రదేశ్ లో అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పటి వరకూ వెలువడ్డ సర్వేలన్నీ బిజెపి తన అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయమని చెబుతున్నాయి.
గత ఎన్నికల ఫలితాలను ఓట్ షేర్ లను చూస్తే కూడా అలానే అనిపిస్తున్నది. జరుగుతున్న ఎన్నికలలో బిజెపి గత ఎన్నికలలో తనకు వచ్చిన ఓట్ల శాతంలో దాదాపు 10 శాతం కోల్పోయినా కూడా ఉత్తర ప్రదేశ్ లో అధికారం నిలబెట్టుకుంటుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో బిజెపి 10 శాతానికి పైగా ఓట్లు కోల్పోయే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. 2012లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ 29 శాతం ఓట్లతో పూర్తి మెజారిటీ సాధించింది. ఆ ఎన్నికలలో బీఎస్పీ 26 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది.
అప్పుడు బీజేపీకి కేవలం 15 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. రెండేళ్ల తర్వాత అంటే 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ తన ఓట్షేర్ను (కూటమి భాగస్వామి అప్నా దళ్తో కలిపి) 42 శాతానికి అంటే మూడింతలు పెంచుకుంది.
బీజేపీకి సొంతంగా 40 శాతం వచ్చింది. 2017 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి మళ్లీ దాదాపు 40 శాతం ఓట్లతో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది. 2019 పార్లమెంటు ఎన్నికలలో ప్రత్యర్థులైన సమాజ్ వాది పార్టీ, బిఎస్ పి ఒక్కటయ్యాయి దీంతో యుపిలో బిజెపికి గట్టి పోటీ ఉంటుందని చాలా మంది భావించారు.
ఇది జరగలేదు సరి కదా బిజెపి తన ఓట్షేర్ను మళ్లీ 50 శాతానికి దగ్గరగా పెంచుకుంది. రాష్ట్రాన్ని స్వీప్ చేసింది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ తన ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోవచ్చుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.
అయితే బిజెపి నుంచి 10 శాతం ఓట్లు చీల్చినా కూడా బిజెపికి ఎలాంటి నష్టం వాటిల్లే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీకి ఓట్ల శాతం ఒక వేళ పెరిగినా అది బిఎస్ పి నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓట్ షేర్ అయితే బిజెపికి ఎలాంటి నష్టం వాటిల్లదు.
సమాజ్ వాది పార్టీ మిగిలిన పార్టీల నుంచి కాకుండా బిజెపి నుంచే ఓట్లను చీల్చాలి. అలా అంత కష్టపడి 10 శాతం ఓట్లు చీల్చినా పని జరగదు. బిజెపికి ఎలాంటి నష్టం వాటిల్లదు. బిజెపి ఉత్తర ప్రదేశ్ లో అధికారం కోల్పోవాలంటే దాదాపు 20 శాతం బిజెపి ఓట్లను చీల్చాల్సి ఉంటుంది. ఇప్పటిలో అది జరిగే పనిలాగా అని పెంచడం లేదు.