జనసేన పార్టీ జాతకం అంతగా బాగున్నట్లు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యేతో సరిపెట్టుకున్న జనసేన పార్టీ రాను రాను మరింత దెబ్బ తింటున్నది. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే వైసిపిలో అనధికారికంగా చేరిపోగా పార్టీకి పెద్ద దిక్కు, క్రెడిబులిటీ పాయింట్ అయిన మాజీ సీబీఐ అధికారి వి వి లక్ష్మీనారాయణ నేడు పార్టీని వదలి వెళ్లిపోయారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు మాటపై నిలకడ లేనందుకు తాను నిష్ర్కమిస్తున్నట్లు లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇక నుంచి సినిమాలలో నటించనని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధం అవుతుండటం వల్ల ఆయన మాటపై నిలబడే తత్వం కాదని అర్ధం అవుతున్నదని, ఈ పరిస్థితుల్లో తాను పార్టీలో కొనసాగలేనని లక్ష్మీనారాయణ అన్నారు.