వచ్చే ఏడాది లో జూన్ నాటికి పేదలకు ఇండ్లు నిర్మించి ప్రారంభోత్సవం జరుగుతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. తాడేపల్లి నుంచీ క్యాంపు కార్యాలయం నుంచీ వర్చువల్ లో ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.ఇళ్లు లేని పేదలెవరూ ఉండకూదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నవరత్నాలు పథకంలో భాగంగా పేదలందరికీ సొంత ఇళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సంకల్పించిందని, ఏ పేదవాడి నోట నుంచీ మాకు ఇల్లు లేదనే మాట వినబడకూడదని.. ఇది నా ఆకాంక్ష అని పేర్కొన్నారు.
దానిలో భాగంగా ఇది వరకే ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, ఇప్పుడు జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని అన్నారు. దశల వారీగా జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వీలైనంత త్వరగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేకంగా ఒక జాయింట్ కలెక్టర్ను కూడా నియమిస్తామని ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రకటించారు.
జిల్లా లోని బొండపల్లి మండలం గొట్లాం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన వేదిక నుంచి వర్చువల్ విధానంలో జరిగిన పేదలందరికీ ఇళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా నుంచీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, శంబంగి చినవెంకట అప్పలనాయుడు, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, జాయింట్ కలెక్టర్ జె.వెంకటరావు, ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్, హౌసింగ్ పీడీ రమణ మూర్తి, ఇతర ప్రజాప్రతినిధులు, సర్పంచులు, లబ్ధిదారులు, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ సీఎం జగన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ప్రతి ఇంటా సంతోషాలు నింపేందుకు, పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కంకణం కట్టుకుందని పేర్కొన్నారు.
3846 కిలోమీటర్ల పాదయాత్రను చేసిన జగన్ పేదలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో వాగ్ధానాలు ఇచ్చారని.. ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్నీ నెరవేరస్తూ పేదల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. జిల్లాలో 98,286 లబ్ధిదారులకు ఇళ్లు వచ్చాయని, సుమారు 1769.15 కోట్ల కేటాయింపు జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. మొదటి దశలో ఇళ్ల నిర్మాణాలు 2022 జూన్ నాటికి పూర్తి చేసి అందించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టందని పేర్కొన్నారు.
జగనన్న కాలనీల్లో విద్యుత్, తాగునీరు, రోడ్లు, ఇంటర్నెట్ తదితర మౌలిక వసతులను కూడా కల్పించి పేదవారి కలలను నిజం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. జగనన్న కాలనీల్లో చేపట్టే పనుల వల్ల ఉపాధి హామీ కూలీలకు, ఇతర పనివారికి ఉపాధి లభిస్తుందన్నారు. తొలి దశలో 28వేల కోట్లు కేటాయిస్తూ 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణియించిందని గుర్తు చేశారు. .
అనంతరం లేఅవుట్ పరిధిలోని లబ్ధిదారులైన అలమండ యశోద, కొల్లి ఆదిలక్ష్మిల గృహ నిర్మాణాలకు డిప్యూటీ సీఎం, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కలెక్టర్, జేసీ, ఆర్డీవో, గృహనిర్మాణ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పూజలు చేసి శంకుస్థాపన రాయి వేశారు.