తెలంగాణ ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఆహారానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయం ఎదుట అంబేద్కర్ విగ్రహం వద్ద అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రమేష్ బాబు సూచనల మేరకు మున్సిపల్ పాలకవర్గం సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారు.
నేడు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ దేవాలయం ముందు భిక్షాటన చేసుకునే యాచకుల ఆకలి తీర్చే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు తెలిపారు.
యాచకులు ఆకలితో అలమటించ కూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే రమేష్ బాబు ఈ కార్యక్రమం చేయమని సూచించారని ఆమె తెలిపారు. లాక్ డౌన్ ఎత్తివేసే వరకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రతిరోజు మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా రాత్రి పూట కూడా భోజన వసతి ఏర్పాటు గురించి ఎమ్మెల్యే రమేష్ బాబు దృష్టికి తీసుకపోగా తక్షణమే వారు స్పందించి ఆలయ అధికారులతో మాట్లాడారని తెలిపారు.
రాత్రిపూట కూడా 100 మంది యాచకులకు భోజన వసతి ఏర్పాటు చేపిస్తామని చెప్పారని ఆమె వివరించారు. మధ్యాహ్నం సమయంలో మున్సిపల్ పాలకవర్గం వారిచే భోజనం ఏర్పాటు చేయగా రాత్రి సమయంలో ఆలయ అధికారులు ఈ సౌకర్యం కల్పిస్తున్నారని తెలిపారు.
కౌన్సిలర్ మారం కుమార్, గోలి మహేష్ వారి పెళ్లి రోజు సందర్భంగా అన్నపూర్ణ క్యాంటీన్ కి 1116 రూపాయల నగదు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ రావు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.