ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లోక్ సభలో వేసిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆర్థిక నిబంధనలు, పద్ధతులను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించినట్లు తేలిందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ గృహ వసతి పథకం కింద ఖర్చు పెట్టిన డబ్బులు మూలధన వ్యయం కింద తప్పుగా చూపించారని కేంద్ర మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.
అంతే కాకుండా స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్లో కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.324.15 కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి తెలిపారు. అంతే కాకుండా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.570.91 కోట్లు ఇచ్చింది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఖాతాకు మళ్లించింది. ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కోసం ఈ నిధులు మళ్లించినట్లు తెలిపారు. కానీ ఈ నిధులు రైతులకు అందజేయలేదు. నిధుల విషయంలో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన విషయాన్ని కంట్రోల్ ఆడిటర్ జనరల్ కూడా ఇప్పటికే నిర్ధారించింది.