ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగేందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చామని, ఆర్డినెన్స్ రాజ్యాంగ పరిధిలోనే ఉన్నందున మాజీ ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ పిటిషన్ తిరస్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టును కోరింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఈ కౌంటర్ దాఖలు చేశారు. ఏపీ స్థానిక ఎన్నికల వాయిదాతో మిగతా రాష్ట్రాలకు ఎలాంటి పోలిక లేదని పేర్కొంటూ ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో స్థానిక ఎన్నికల వాయిదా పరిస్థితులను అఫిడవిట్లో ప్రభుత్వం పేర్కొంది.
మరోవైపు స్థానిక ఎన్నికలు వాయిదా పడినా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని రమేష్ కుమార్ ప్రకటించడం సరికాదని ద్వివేదీ అభిప్రాయపడ్డారు. ఎన్నికల వాయిదా తర్వాత ఆయన చేసిన చర్యలు సరికాదని, ఆర్టికల్ 243 ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవీకాలానికీ, సర్వీస్ రూల్స్ విడిగా చూడాల్సిందేనని ద్వివేదీ స్పష్టం చేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని నిర్ణయించే అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంటుందని, గవర్నర్ ఆమోదించాకే ఆర్డినెన్స్ తీసుకొచ్చామని పేర్కొన్నారు. గవర్నర్ ఆమోదించాక ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదన్నారు.