విధి నిర్వహణలో దారుణంగా హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఖమ్మం, జిల్లా రఘునాథపాలెం మండలం, ఈర్లపూడి గ్రామానికి వెళ్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు భార్యా పిల్లలను తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చి, మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ స్థితిగతులను, ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విధి నిర్వహణలో నిఖార్సయిన నిజాయితీ అధికారి శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోవడం చాలా దారుణమైన సంఘటన అన్నారు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని పేర్కొన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించినట్టుగానే డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్ ఉద్యోగం వెంటనే ఆ కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పోడు పట్టాలు పంపిణీ చేస్తామని పలుమార్లు ప్రభుత్వం ప్రకటన చేసింది అన్నారు. ప్రభుత్వం చేసిన ప్రకటన కాగితాలకే పరిమితం కావడంతో సమస్యను పరిష్కరించకుండా నాన్చుడు ధోరణి అవలంబింస్తుందన్నారు. పోడు భూముల రగడ జటిలం కావడం వల్ల విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన శ్రీనివాసరావు ప్రాణం పోయిందని ఇందుకు ప్రభుత్వ తప్పిదాలు విధానాలే కారణమని విమర్శించారు.
2014లో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ పోడు భూముల వద్ద కుర్చీ వేసుకొని సమస్యను పరిష్కరిస్తానని ప్రగల్బాలు పలికి 8 ఏండ్లు అవుతున్నదని గుర్తు చేశారు. కుర్చీ వేసుకొని పోడు సమస్య పరిష్కరిస్తానన్న కేసీఆర్ ఎటు వెళ్లాడో తెలియడం లేదన్నారు. ప్రభుత్వ విధానపరమైన తప్పిదాల వల్లనే ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతం అవుతావున్నయన్నారు. ప్రభుత్వం పోడు భూముల రైతుల సమస్యలను నాన్చకుండా వీలైనంత త్వరగా పరిష్కరించి సంబంధిత రైతులకు పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, పీసీసీ సభ్యులు, కాంగ్రెస్ జిల్లా నాయకులు తదితరులు ఉన్నారు.