మద్యం బాటిల్స్ పై జగనన్న ఫోటో పెట్టాలి
జగనన్న తోడు, జగనన్న చేదోడు, జగనన్న అమ్మవడి, జగనన్న వసతి దీవెన, జగనన్న జీవ క్రాంతి, జగనన్న విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న పచ్చ తోరణం…. ఇలా చాలా పథకాలకు జగనన్న పేరు పెట్టి మద్యం షాపులకు మాత్రం జగనన్న పేరు పెట్టకపోవడం బాధాకరంగా ఉందని విజయనగరం జిల్లా సాలూరు జనసేన పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ధరలు పెంచితే మద్యం మానేస్తారు అన్నట్లే జగన్ గారి ఫోటో మద్యం సీసాలపై వేస్తే ఆ ఫోటో చూసి కొందరు జగన్ గారి అభిమానులు మద్యం మానేసే అవకాశం ఉంది కనుక జగన్ గారి ఫోటో మద్యం సీసాలపై వేసి తద్వారా మద్యం మాన్పించి యువతకు ఆదర్శంగా నిలవాలి అని తెలియచేశారు.
వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కేందుకు విడతల వారి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నేడు ప్రజల్లో మద్యం మాన్పించే చర్యలు చెయ్యకుండా అధిక ధరలకు కొత్త, చెత్త బ్రాండుల మద్యం అమ్ముతున్నారని వారన్నారు. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలతో అడుకుంటున్నారని వారు తెలిపారు.
కొన్ని దశాబ్దాలుగా తగ్గిన నాటు సారా వినియోగం నేటి ప్రభుత్వ నిర్ణయం వల్ల కుప్పలు తెప్పలుగా దొరుకుతుందని జనసేన నాయకులు తెలిపారు. దీనివల్ల ఎందరో అమాయకులు ఆరోగ్యాలు పాడు చేసుకొని ప్రాణాలు కోల్పోతున్నారని వారు తెలిపారు. ఇప్పటికైనా కళ్ళు తెరచి ప్రభుత్వం అయితే సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలి లేదా పాత ధరలకే పాత బ్రాండుల మద్యం అమ్ముతు నాటు సారాను నిర్ములించే చర్యలు చేపట్టాలి అని జనసేన పార్టీ సాలూరు నాయకులు నిరసన వ్యక్తం చేశారు.