విజయనగరం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు నాణ్యమైన విద్యనందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సంయుక్త కలెక్టర్ అభివృద్ధి డా. మహేష్ కుమార్ తెలిపారు.
కలక్టరేట్ ఆడిటోరియం లో నాడు- నేడు అకడమిక్ పాఠశాలల మాపింగ్ పై ప్రజా ప్రతినిధులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జే.సి మాట్లాడుతూ ప్రాధమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను మూడు కిలోమీటర్ల పరిధి లో ఉన్న 278 ఉన్నత పాఠశాలలకు మాపింగ్ చేయడం జరుగుతోందన్నారు. జిల్లాలో 1 కి.మీ పరిధి లో నున్న 421 పాఠశాలలను, 1 నుండి 2 కి.మీ ల మధ్య నున్న 252 పాఠశాలలను, 2 నుండి 3 కి.మీ లధ్య దూరం ఉన్న 310 పాఠశాలలను, 3 కి.మీ ల పైన ఉన్న 1365 పాఠశాలల మొత్తం 2348 పాఠశాలల మాపింగ్ చేయడం జరుగుతుందన్నారు.
ఈ మాపింగ్ వలన పాఠశాలల సంఖ్య గానీ, ఉపాధ్యాయుల సంఖ్య గానీ మారబోదని స్పష్టం చేసారు. 8 ఉన్నత పాఠశాలలను రైల్వే ట్రాక్, జాతీయ రహదారి, స్టేట్ హై వే, 1000 మంది విద్యార్ధులు దాటిన వాటినకి మాపింగ్ జరగలేదన్నారు. ఇందులో 1,84,165 మంది విద్యార్ధులు ఉండగా 8,690 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. 8పాఠశాలల ను మాపింగ్ చేయకుండా యదావిధిగా ఉంచడం జరిగిందన్నారు ప్రభుత్వం నిర్దేశించిన జాతీయ విద్యా విధానం పై ఎం.ఈ.ఓ లు అవగాహన చేసుకొని ప్రజలకు అర్ధం అయ్యేలా తెలియజేయాలన్నారు. జాతీయ విద్యా విధానం లో ఏ ఒక్క పాఠశాలను మూసివేయడం జరగదని, ఏ విద్యార్ధికి ఎలాంటి నష్టం జరగబోదని స్పష్టం చేసారు.
నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ పాఠశాలల విలీనం పై మండల విద్యా అధికారులు మండల స్థాయి లో ఎం.పి.పి, జెడ్.పి.టి..సి సర్పంచ్ లకు అవగాహన కలిగించి విలీన ప్రక్రియ చేపట్టాలన్నారు. ఏ పాఠశాలనుండి ఎంత మంది ఏ పాఠశాలకు వెళ్తున్నారు అనే వివరాలను తెలియ జేయాలన్నారు. ఈ అవగాహనా సదస్సు లో రెండు విలీన పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొనాలని తెలిపారు. జాతీయ విద్యా విధానం వలన కలిగే లాభాలను కూడా తల్లి దండ్రులకు అర్ధం అయ్యేలా చెప్పాలని, వారిని ఒప్పించి మాత్రమే విలీన చర్యలు చేపట్టాలని కోరారు.
ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస రావు మాట్లాడుతూ అనేక మంది ఐ.ఏ.ఎస్ అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారని, ఉపాధ్యాయులు తల్లి దండ్రులకు ప్రభుత్వ స్కూల్స్ పై నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. పూర్వం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి చదువుకునేవారమని, దీనివలన కష్టం తెలిసేదని పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి ఉపాధ్యాయులకు ప్రత్యెక శిక్షణలు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేసారు. ప్రతి సబ్జెక్టు కు ఎక్స్పర్ట్ టీచర్స్ ఉండాలన్నారు.
ప్రస్తుతం అనేక వసతులతో పాఠశాలలు ఉన్నాయని వీటిని విద్యార్ధులు సద్వినియోగం చేసుకొనేలా ఉపాధ్యాయులే దిశా నిర్దేశం చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ లెర్న్ టు రీడ్, రీడ్ టు లెర్న్ అనే నినాదాన్ని విద్యార్ధులకు అలవాటు చేయాలన్నారు. దేశం లో విద్య కోసం 120 కోట్ల ను బడ్జెట్ లో కేటాయిస్తే మన రాష్ట్రం లో 30 వేల కోట్లను కేటాయించారని, సీఎం కి విద్య పై నున్న చిత్త శుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. జగనన్న విద్య దీవెన, విద్యా కానుక, వసతి దీవెన వంటి పధకాలతో తల్లి దండ్రులకు ఆర్ధిక కష్టాలు లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఎం.ఎల్.సి డా. సురేష్ బాబు, ప్రాంతీయ సంయుక్త డైరెక్టర్ జ్యోతి కుమారి, డి.ఈ.ఓ బ్రహ్మాజీ, సమగ్ర శిక్ష పి.డి. స్వామి నాయుడు , మండల విద్యా శాఖాధికారులు పాల్గొన్నారు.