లాక్ డౌన్ సందర్భంగా వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని పీసీసీ చీఫ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. జిల్లాలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలను వారి స్వస్థలం ఒరిస్సా రాష్ట్రానికి పంపడానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాహన సౌకర్యం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పార్లమెంట్ నియోజకవర్గ నిధుల నుంచి జిల్లాలోని వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్ళడానికి వాహన సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వలస కూలీల ఆదుకోవడంతో పాటు వారి స్వస్థలాలకు పంపేందుకు వాహన ,భోజన సౌకర్యం ఏర్పాటు చేసిందని అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి వలస కూలీలకు సౌకర్యాలు కల్పించడంలో విఫలం చెందాయని ధ్వజమెత్తారు.
దీంతో వారు అనేక ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజలను, వలసకూలీల ఆదుకోవడానికి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ సొంత ఖర్చులతో కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వలసకూలీల వారి స్వస్థలాలకు పంపించామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ బొంత వెంకటయ్య, ఎంపీపీ మనిమద్దే సుమన్ ,వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, పనస శంకర్,పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.