రాష్ట్రంలో కరోనా నియంత్రణ కు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడంపై రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అసంతృప్తిగా ఉన్నారా? అవును. ఆమె తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జాతీయ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించడారు. కరోనా కట్టడిలో కేసీఆర్ సర్కార్ క్రియాశీలకంగా వ్యవహరించలేదన్నారు. కరోనా ఉధృతిని ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందన్నారు.
కరోనా నియంత్రణకు పెద్ద సంఖ్యలో టెస్టులు చేయడమే పరిష్కార మార్గమని, మొబైల్ టెస్టింగ్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని తమిళిసై అన్నారు.
కరోనా తీవ్రత, వ్యాప్తిపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ.. సూచనలు చేస్తూ… ఐదారు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలేదని గవర్నర్ తమిళిసై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకే టెస్టులు చేస్తున్నామని…ప్రభుత్వం సమర్ధించుకుంటోందని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు.
కట్టడి ప్రాంతాల విషయంలో కూడా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు. కరోనా బాధితులు ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు లేక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారని, కోవిడ్ చికిత్స తెలంగాణ ప్రభుత్వానికి భారంగా మారిందని తమిళిసై అన్నారు.
అన్ని వసతులు సమకూర్చామని ప్రభుత్వం చెబుతున్నా… ప్రభుత్వాస్పత్రుల పట్ల రోగులు ఆసక్తి చూపట్లేదన్నారు. సీఎం కేసీఆర్తో సమావేశమైనప్పుడు ఈ విషయాలను గట్టిగానే చెప్పానని తమిళిసై వ్యాఖ్యానించారు.