ధాన్య సేకరణ కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియను వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో ధాన్యo సేకరణ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 221 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించి, అన్ని కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 25 కేంద్రాలలో 355 మంది రైతుల నుండి 2391.040 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 2210.400 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించినట్లు ఆయన అన్నారు. 355 మంది రైతుల నుండి రూ. 4,80,70,554 విలువ గల ధాన్యం కొనుగోలుకు గాను ఇప్పటికి 143 మంది రైతులకు చెందిన రూ. 1,66,37,384 ల ధాన్యం ఓపిఎంఎస్ లో నమోదు చేసినట్లు, 113 మంది రైతులకు రూ. 97,79,816 లు చెల్లింపులు చేసినట్లు ఆయన తెలిపారు.
95 లక్షల గన్ని బ్యాగులకు గాను 68,27,850 లు అందుబాటులో ఉన్నట్లు ఆయన అన్నారు. గన్ని బ్యాగులు కేంద్రాలకు పంపిణీ చేసి, కొనుగోలు కేంద్రాలలో తేమ పరీక్ష, తూకం, తూర్పారబట్టే పరికరం, టార్పాలిన్, సిబ్బంది కావాల్సినవి అన్ని అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం ఎప్పటికప్పుడు తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పట్టా పాస్ బుక్ లేని రైతుల జాబితా తయారు చేసి, ముందస్తుగా ధ్రువీకరణలు అందజేయాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరణలో భాగస్వామ్యం చేయాలన్నారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా ఉన్నట్లు ఆయన తెలిపారు. సీఎంఆర్ రైస్ లక్ష్యం పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సోములు, ఎఫ్సిఐ మేనేజర్ రంగ ప్రసాద్, డిఆర్డీఓ విద్యాచందన, డిసిఓ విజయ కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి సరిత, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మ రాజేశ్వరరావు, కార్యదర్శి నగేష్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.