టిఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ పాలన చూస్తే రజాకార్ల కాలం గుర్తుకు వస్తున్నదని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మాజీ.ఎం.పి డా.మల్లురవి అన్నారు. పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకువచ్చిన G.O No.203 కు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ఒక రోజు సత్యాగ్రహ దీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందని అయితే తెలంగాణ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో తమను గృహ నిర్బంధంలో ఉంచిందని ఆయన అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీలోని ఎల్లూరు గ్రామంలో కృష్ణానది పై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలని కోరుతున్నా రైతుల గోస పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. 6 సంవత్సరాల కేసీఆర్ అసమర్థ పాలనలో మహబూబ్ నగర్ జిల్లాలో 90% పూర్తయిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేకపోయారని డాక్టర్ మల్లు రవి అన్నారు.
కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా & కోయిలా సాగర్, పాలమురు-రంగారెడ్డి ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నదని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులందరినీ గృహ నిర్బంధంలో ఉంచడం నిరంకుశ పాలన కిందికి వస్తుందని ఆయన అన్నారు.
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తుండగా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ సిఎల్పి నాయకుడు జానా రెడ్డి, పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను అరెస్టు చేశారని ఆయన అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా ఎగతాళి చేయడమేనని మల్లు రవి అన్నారు.