నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్(ఎన్ఐపీ) కింద తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే ప్రాజెక్టులెన్ని అని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు కేంద్ర ప్రభుత్వాన్ని లోక్సభలో ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇటువంటి ప్రాజెక్టు నిర్వహించడం కేంద్రానికి తొలిసారి అని చెప్పారు.
ఎన్ఐపి ప్రారంభించినప్పుడు దేశవ్యాప్తంగా 6,835 ప్రాజెక్టులు మాత్రమే చేపట్టాలని అనుకున్నామని వివరించారు. అటుతర్వాత ఆ సంఖ్యను 9,335 ప్రాజెక్టులకు పెంచినట్టు తెలిపారు. అయితే, ఈ లిస్టులో రానున్న రోజుల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని వివరించారు. 2020-25 వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఒక ప్రణాళిక వేసుకున్నామని అందులో తెలంగాణకు ఎన్ఐపీ కింద 217 ప్రాజెక్టులకు గానూ రూ. 2,90,939 కోట్లు ఇవ్వాలని నిర్ధారించినట్టు తెలిపారు. అయితే, అందుకు మరింత సమయం పడుతుందని స్పష్టం చేశారు.