ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశతో కూడిన అవగాహన రాహిత్యం వల్ల ప్రజల నెత్తిన ట్రూ అప్ చార్జీల భారం పడుతోందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. పాలకుల పనికిమాలిన చేష్టల వల్ల, తాను ముఖ్యమంత్రినని ఏమి చేసినా చెల్లుతుందని అహంభావం కారణంగానే ప్రజలకు మరోసారి విద్యుత్ భారం తప్పడం లేదు.
ఇప్పటికే ఏడుసార్లు విద్యుత్ చార్జీలను పెంచారు. ఇప్పుడు ఎనిమిదవ సారి విద్యుత్ చార్జీలను పెంచబోతున్నారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల ప్రజలు దారుణంగా నష్టపోతున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో రెన్యుబుల్ ఎనర్జీ కోసం కొన్ని పి పి ఏ లను చేసుకుంది. యూనిట్ విద్యుత్ మూడు నుంచి మూడున్నర రూపాయలకు కొనుగోలు చేసే విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏలను గౌరవించకుండా, రేటు తగ్గించాలని కోరడం, వారి నుంచి విద్యుత్ ను కొనుగోలు చేయకుండా మానేశారన్నారు. పిపిఏ లను పునసమీక్షించేందుకు విద్యుత్ నిపుణుల కమిటీ అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి తో పాటు మరొక రెడ్డితో కమిటీ వేశారు. పిపిఏ లు చేసుకున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన పాత బకాయిలను నిలిపివేశారు.
కొత్తగా విద్యుత్తును కొనడం ఆపివేశారు. ఎక్స్చేంజిలో యూనిట్ విద్యుత్ కు ఐదు రూపాయలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనితో యూనిట్ విద్యుత్ ధరకు అదనంగా రూపాయిన్నర చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో పిపిఏ ఒప్పందాలను చేసుకున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. హిందూజా ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను బొగ్గు ధర మినహాయించి, మిగిలిన ధర చెల్లించాలి. రెన్యుబుల్ ఎనర్జీ కి రా మెటీరియల్ ఉండదు. ఒప్పందం కుదుర్చుకున్న మేరకు ధర చెల్లించాలి.
ఉత్పత్తి అయిన విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానం చేయకుండా మూర్ఖత్వంతో మొండిగా తీసుకోకుండా ఆపివేశారు. విద్యుత్ ను తీసుకొని ధరను నెగోషియేట్ చేసి ఇవ్వవచ్చు . పి పి ఏ ఒప్పందాలను కాదని అనడానికి వీలు లేదు. వారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. పిపిఏలు చేసుకున్న సంస్థలకు యూనిట్ విద్యుత్తు ధర మూడున్నర చెల్లించడంతోపాటు ఎక్స్చేంజిలోయూనిట్ విద్యుత్ ఐదు రూపాయలకు కొనుగోలు చేయడం వల్ల , ప్రజలపై యూనిట్ విద్యుత్ భారం ఎనిమిది రూపాయలు పడింది.
ఎక్స్చేంజిలో కాకుండా, అదే పిపిఏలు చేసుకున్న సంస్థల వద్ద విద్యుత్ ను కొనుగోలు చేసి ఉంటే మూడు నుంచి మూడున్నర రూపాయలకే యూనిట్ విద్యుత్ లభించి ఉండేది. పాలకులు అజ్ఞానంతో , కక్కుర్తి పడి ఎక్స్చేంజిలో విద్యుత్ కొనుగోలు చేసి ప్రజలపై భారాన్ని మోపారు. విజ్ఞులైన ప్రజలు తమ నెత్తిన రాష్ట్ర ప్రభుత్వం మోపిన భారాన్ని అర్థం చేసుకోవాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.
ప్రభుత్వం కుదుర్చుకున్న పీపీఏ ఒప్పందాలను గౌరవించాలని బుద్ధి జ్ఞానం ఉన్న ఎలక్ట్రిసిటీ అధికారులకు తెలియదా?, వారికి బుద్ధి ఉండే ఉంటుంది… కానీ బుద్ధి లేనిది ఎవరికో ప్రజలు అర్థం చేసుకోవాలి. న్యాయస్థానాలు ఆదేశించినప్పటికీ, విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఏమీ లేదు. న్యాయస్థానాలు ఆదేశించిన తనకు తమిళనాడు ప్రభుత్వం ఇప్పటివరకు బకాయిలు చెల్లించలేదు.
న్యాయస్థానాలు ఆదేశించాయని చెప్పి విద్యుత్ బకాయిలు చెల్లించారంటే, అందులో ఏదైనా మతలబు ఉండే ఉంటుంది. హిందూజా ప్లాంట్ ఖాళీగా ఉంచినందుకు 1230 కోట్ల రూపాయలను అప్పుచేసి మరి ఆ సంస్థకు చెల్లిస్తున్నారు. ఆ భారాన్ని మొత్తం ఇప్పుడు ప్రజలు ట్రూ అప్ చార్జీల రూపంలో భరించాల్సిందే. సకాలంలో బొగ్గును కొనుగోలు చేయకుండా, అదానీ సంస్థ వద్ద కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపించారు. దీని వల్ల ప్రజలపై ట్రూ అప్ చార్జీల భారం పడుతుండగా, ప్రభుత్వ అధినేతలకు లబ్ధి చేకూరుతోంది. పాలకుల అజ్ఞానం వల్ల 20వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం ప్రజలపై పడిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.