ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త పాఠశాలలను ఏర్పాటు చేయకపోయినా సరే… కానీ ఉన్న 8 వేల స్కూళ్లను మూసి వేసేందుకు చర్యలు తీసుకోవడం దుర్మార్గమని నర్సాపురం పార్లమెంటు సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె. రఘురామకృష్ణం రాజు అన్నారు.
స్కూళ్ల మూసివేతతో పాటు, ఉపాధ్యాయుల పోస్ట్లలోను కోత విధించాలని నిర్ణయించారన్నారు.. ఇక రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా మాతృభాషలో ప్రాథమిక విద్యను అందించకుండా, ఎనిమిదో తరగతి వరకు పరాయి భాష అయిన ఇంగ్లీష్ మాధ్యమంలో పాఠశాలలను ఏర్పాటు చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని పేర్కొన్నారు.
అయితే ఈ విషయమై హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారాన్ని అందించిందని రఘురామ అన్నారు. ఇప్పటికే 8వ తరగతి వరకు ఆంగ్ల భాషలోనే విద్యా బోధన అని ముఖ్యమంత్రి చెబుతుంటే, అడ్వకేట్ జనరల్ మాత్రం ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతూ కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారన్నారు.
మదనపల్లి సభలో ఇదే విషయమై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ఊరికి ఒక పాఠశాల ఏర్పాటు చేసి లక్ష 60 వేల టీచర్ ఉద్యోగాల కల్పనకు కృషి చేసినట్లుగా చెప్పారని ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రస్తావించారు.
అయితే నూతన పాఠశాలలు ఏర్పాటు చేయకపోయినా, ఉన్న పాఠశాలలను మూసివేయడం ఏమిటంటూ విద్యార్థులే రోడ్డుకి ఆందోళన చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అమ్మ ఒడి వద్దు… బడే ముద్దు అంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన గురించి తమ వంటి వారు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తారని చెప్పారు.
ఒకవేళ ఎవరైనా పత్రికలో రాస్తే ఎదురు కేసులు తమ వంటి వారు ప్రశ్నిస్తే గొడ్డు ను బాదినట్లుగా బాదుతారన్నారు. ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలలను గొప్పలు పోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పటివరకు సగం పాఠశాలలకు పుస్తకాలు బ్యాగులను అందజేయలేకపోయారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.