అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా డబ్బుల పంపిణీతో పాలన సాగిస్తూ, ఇమామ్ లకు, మౌజంలకు, పాస్టర్లకు నెల నెలా క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వడంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల కట్టిన పన్నుల డబ్బుతో ఓటు బ్యాంకు రాజకీయాలు, మత రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ప్రజల అభివృద్ధిని వారి సంక్షేమాన్ని గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న మాట వాస్తవం అని ఆయన అన్నారు. ఇప్పుడు కొత్తగా చర్చిల నిర్మాణాలకు,
వాటి రిపేర్లకు నియోజకవర్గానికి కోటి చొప్పున కేటాయించడం ద్వారా వైసీపీ ప్రభుత్వం ఈ ఓటు బ్యాంకు రాజకీయాలను పతాకస్థాయికి చేర్చిందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఒకవైపు బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వాటిని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు కట్టిన పన్నులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని బిజెపి ఆంధ్రప్రదేశ్ హెచ్చరిస్తోంది.