కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రజాస్వామ్యానికే విజయమని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి వ్యాఖ్యానించారు. కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా సామాన్య మానవులు అందరూ కూడా కాంగ్రెస్ పై పూర్తి నమ్మకంతో భారీ విజయాన్ని సమకూర్చారని ఆయన అన్నారు. నియంతృత్వ పెట్టుబడిదారీ వ్యవస్థను కర్నాటక ప్రజలు కూకటి వేళ్లతో పెకలించి వేశారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి మరీ భారత్ జోడో యాత్ర చేశారని దాని ఫలితం ఇప్పుడు కర్నాటకలో కనిపిస్తున్నదని డాక్టర్ మల్లు రవి అన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశం ప్రజలకు చేరిందని, మతాలకు ప్రాంతాలకు అతీతంగా దేశం గురించి ఆలోచించాలనే ఆయన సందేశానికి లభించిన ప్రజల మద్దతు ఇది అని ఆయన అన్నారు. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కర్నాటక తరహా ఫలితాలే వస్తాయని డాక్టర్ మల్లు రవి వ్యాఖ్యానించారు.
previous post
next post