యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కు రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో ప్రాణహాని ఉందని, కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్ధులు, అసాంఘిక శక్తులతో లోకేష్ కు ప్రాణహాని ఉందని అనేకమార్లు మీ దృష్టికితీసుకొచ్చాం.
కానీ, సంబంధిత అధికారుల ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. యువగళం పాదయాత్రపై ఓ వర్గం పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ప్రొద్దుటూరులో వైకాపా ఎమ్మెల్యే ప్రోద్బలంతో టిడిపి అథినేత చంద్రబాబు
నాయుడిపై అసభ్యకర పదజాలంతో ప్లెక్సీలు వేశారు. దీనిపై నారా లోకేష్ స్థానిక పోలీసుల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆశ్చర్యకరంగా ప్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై డీఎస్పీ నాగరాజు, ఎస్.ఐ రాజారెడ్డి, ఇబ్రహింలు చర్యలు
తీసుకోవడం మాని ఫ్లెక్సీలు వేయడంను సమర్ధించారు. ఈ నేపద్యంలో జూన్ 1 న వైసీపీ మద్దతుదారులు పాదయాత్ర చేస్తున్న లోకేష్ పై కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు విసిరారు. కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు విసిరినవారి వెనుక పోలీసులు ఉండటం
దురదృష్టకరం. లోకేష్ కు భద్రత కల్పించడంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. లోకేష్ పై గుడ్లదాడి గురించి పోలీసులకు ముందే తెలుసు. అయినప్పటికీ రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందారు. ఇటువంటి ఘటనలు
భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. నిందితులపై క్రిమినల్ కేసు బుక్ చేయాలని, లోకేష్ కు రక్షణ కల్పించడంలో తమ బాధ్యతలను విస్మరించిన పోలీసు అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.