ముస్లింలంటే ఎందుకింత కక్ష ముఖ్యమంత్రి గారూ ? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఒక ముస్లిం కుటుంబాన్ని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రెడ్డి బంధువులు నిలువుగా దోచుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు.
జగన్రెడ్డి బంధువులు, పార్టీ నేతలకు అధికారమే ఆయుధమైంది. చట్టం చుట్టమైంది. పోలీస్వ్యవస్థని జగన్రెడ్డి ఫ్యాక్షన్ సైన్యంగా మార్చుకుంటున్నారు. వారి కన్నుపడితే కబ్జా, ఆశపడితే ఆక్రమణ. ఇదేంటని నిలదీస్తే నిర్బంధం. కబ్జాలపై పోరాడితే పోలీసు చిత్రహింసలు. ఇదీ ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న రాక్షస రాజ్యం అని లోకేష్ అన్నారు. తమపొలాన్ని వైసిపి నాయకుడు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి కబ్జా చేశారని, ఇది అన్యాయం అని నిలదీస్తే మైదుకూరు సీఐ కొండారెడ్డి ఎన్కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారని కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన వైసీపీ కార్యకర్త అక్బర్ బాషా ఆందోళన వ్యక్తం చేశారని లోకేష్ తెలిపారు.
సీఎం సొంత జిల్లా, సీఎం సొంత పార్టీ కార్యకర్త బాషాయే వైసీపీ నేతల అరాచకాలకు తాళలేక కుటుంబంతోసహా ఆత్మహత్య చేసుకుంటామని రోదిస్తున్నారంటే..రాష్ట్రంలో ఏ స్థాయి దౌర్జన్యాలు సాగుతున్నాయో అర్థం అవుతోందని లోకేష్ అన్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి అంతం చేశారు. మరో ముస్లిం మైనారిటీ కుటుంబం ఉసురుపోసుకోవద్దని లోకేష్ కోరారు.