ఒంటరిగా పోరాటం చేయడానికి చేతకాక చంద్రబాబునాయుడు పొత్తుల కోసం ఆరాటపడుతున్నారని మంత్రి రోజా విమర్శించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు టీ కొట్టుకు వెళ్తే జై జగన్ అని అక్కడ ఉన్న యువత అనడంతో అక్కడి నుంచి పక్కకు జారుకున్నారని రోజా ఎద్దేవా చేశారు.
అధికారం లేదు.. ఇక రాదు అని అక్కసుతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె అన్నారు. 2024 ఎన్నికలలో చంద్రబాబునాయుడుకు బాదుడే బాదుడు అని రోజా ఎద్దేవా చేశారు.
‘‘గతంలో అధికారం ఇస్తే అన్న క్యాంటిన్ల నుంచి అమరావతి వరకు నువ్వు, నీ కొడుకు ఈ రాష్ట్రాన్ని రాబందుల్లా తిన్నారు’’ అని రోజా ఆరోపించారు. చిన్న పిల్లల కోడి గుడ్ల దగ్గర్నుంచి ఫైవ్ స్టార్ వంటల వరకు దోచుకున్నది మీరే అని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబును క్విట్ చేయాలని రోజా ప్రజలకు పిలుపునిచ్చారు.