మైనారిటీ సంక్షేమ శాఖకు కేటాయించిన మొత్తం బడ్జెట్ నవరత్నాల అమలు కోసం తరలిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీలకు ద్రోహం చేస్తున్నదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ అన్నారు. 2018-19, 2019-20, 2020-2021 సంవత్సరాలకు మైనారిటీ సంక్షేమ శాఖ కు కేటాయించిన బడ్జెట్ వివరాలను ఆర్టీఐ యాక్ట్ ద్వారా సేకరించి చూస్తూ ఈ విషయం బోధపడిందని ఆయన అన్నారు.
దేశంలో బిజెపి పాలిత ప్రాంతాల్లో సైతం మైనారిటీ బడ్జెట్ వేరు, జనరల్ బడ్జెట్ ద్వారా లబ్ది వేరు వేరుగా మైనారిటీలు పొందుతున్నారని, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా చేస్తూ మైనారిటీలకు ప్రభుత్వం మోసం చేస్తున్నారని షిబ్లీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
దులహాన్ పథకం అమలులో ఉన్నదా?
గత 18 నెలల నుండి అమలులో లేని దులహాన్ పథకానికి 2019-20 సంవత్సరంలో 100 కోట్ల రూపాయలు కేటాయించారని, 100కోట్ల రూపాయలు నిధులు విడుదల అయ్యాయని ఆర్టీఐ రిపోర్ట్ తెలుపుతుంది. కానీ వాస్తవానికి అసలు పథకమే అమలులో లేదు మరి ఆ 100కోట్ల రూపాయలు ఏమైనట్టు? అని షిబ్లీ సూటిగా ప్రశ్నించారు.
గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ నుండి అమ్మ ఒడి పథకానికి 452 కోట్లు మైనారిటీ శాఖ నుండి తీసుకోవటం దేనికి నిదర్శనం? అని ఆయన ప్రశ్నించారు. ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో అన్ని మైనారిటీ సంస్థలు కనుమరుగై పోతాయి అని షిబ్లీ ఆవేదన వ్యక్తంచేశారు.
మైనారిటీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు కోట్ల రూపాయలలో నెల నెల జీతాలు ఇస్తున్నారు కానీ బడ్జెట్ లేక వారికి పని కూడా లేదు. మైనారిటీ బడ్జెట్ మొత్తం నవరత్నాల అమలుకు తరిలిపోటే ఇంకా మైనారిటీ సంక్షేమ శాఖ ఎందుకు అని షిబ్లీ ప్రశ్నించారు.