చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ శాసనసభ ప్రివిలైజ్ కమిటీ ఎదుట బోరున విలపించారు. టీటీడీలో కూడా ఇదే పరిస్థితి ఉందని ఫిర్యాదు చేశారు. ఎన్ని కమిటీలు వచ్చినా, ఎంత మందికి చెప్పుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆమె వాపోయారు.
ఎమ్మెల్యే రోజా ఇలా బాధపడటం వెనుక అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో అధికార పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరు ఆమె ఆవేదనకు కారణం. ప్రొటోకాల్ ప్రకారం అధికార కార్యక్రమాలకు పిలవకపోవడం, సొంత నియోజకవర్గంలో ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగినా అధికారులు రోజాకు సమాచారం అందించడం లేదు.
దీంతో ఆమె ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో భాగంగా తిరుపతిలో ఇవాళ విచారణకు హాజరయ్యారు. గతంలో ఇలా పలుసార్లు జరిగిందని కమిటీ ముందు తన ఆవేదన వెలిబుచ్చారు.
సొంత పార్టీ అధికారంలో ఉండగా… తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని.. సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అధికారులపై ఫిర్యాదు చేశారు. శాసనసభ సభ్యురాలిగా ప్రొటోకాల్ ప్రకారం అన్నీ సవ్యంగా జరిగేలా చూడాలని కమిటీని కోరారు.