కరోనా మహమ్మారి విజృంభించి ఉన్న సమయంలో పవిత్ర రంజాన్ మాసంలో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తున్నట్లు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ తెలిపారు. అవి: 1.ఎలాంటి సమయం ఇవ్వకుండా లాక్ డౌన్ విధించిన కారణంగా వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారు మన రాష్ట్రంలో చిక్కుకు పోయారు.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వారు కుటుంబంతో కలిసి ఉండేలా వారిని స్వరాష్ట్రాలకు పంపాలి. అలాగే నెల్లూరు, చిత్తూరు, కృష్ణా జిల్లాలుకు చెందిన ముస్లింలు వేరే రాష్ట్రాలలో చిక్కునని ఉన్నారు. వారిని మన రాష్ట్రానికి తెప్పించాలి.
2. గత ప్రభుత్వ హయాంలో రంజాన్ తోఫా ఏర్పాటు చేసి నిరుపేదలకు నిత్యవసర వస్తువులను ఇచ్చేవారు. దేశంలో లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి ఉన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రభుత్వ ఇఫ్తార్ విందు బడ్జెట్ ను పేదల నిత్యావసర వస్తువులను అందచేసేందుకు వినియోగించి వారిని ఆదుకోవాలి. 3. ప్రార్ధనాలయాలు, మదర్సాల ఇంటి పన్ను, నీటిబిల్లు, కరెంటు బిల్లులు మాఫీ చేయాలి.
4. రంజాన్ సందర్భంగా పేదలను ఆదుకునే సాంప్రదాయం ముస్లింలలో ఉంటుంది కాబట్టి సామాజిక దూరం పాటిస్తూ పేదలకు సాయం చేసేందుకు ముస్లిం మత సంఘాలకు అనుమతి ఇవ్వాలి.5.స్వరాష్ట్రాలకు వెళ్లలేని ముస్లింలకు ప్రభుత్వమే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలి లేదా ఏదైనా సంఘానికి ఆ బాధ్యత అప్పగించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయాలపై మానవతా దృక్పథంతో ఆలోచించి సానుకూలంగా ఆదుకుంటారని ఆశిస్తున్నట్లు ఫారూఖ్ షిబ్లీ తెలిపారు. అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను, లాక్ డౌన్ నిబంధనలు పూర్తిగా గౌరవిస్తూ కరోనా రహిత భారతదేశం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా ఫారూఖ్ షిబ్లీ ముస్లింల తరపున హామీ ఇచ్చారు.