భారతీయ సంప్రదాయానికి ప్రతీక రాఖీ పండుగ అని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. జిల్లా వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ మను చౌదరికి పలువురు మహిళలు రాఖీలు కట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మను చౌదరి జిల్లా ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని ప్రతిబింబిస్తుందని, భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
రాఖీతో అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానుబంధం మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. సోదరులంతా తమ అక్కాచెల్లెళ్లపై అనిర్వచనీయమైన ప్రేమను కురిపించడంతోపాటు వారి రక్షణ బాధ్యతలు ప్రతి సోదరుడు తీసుకోవాలని ఆయన కోరారు.
చేతికి రాఖీ కట్టడం గొప్ప సందర్భంగా కలెక్టర్ అభివర్ణించారు. రక్షాబంధన్ సంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని తెలిపారు. ప్రజల్లో సహోదరత్వాన్ని రాఖీపండుగ మరింతగా పెంచుతుందని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలోకార్యదర్శి కే భరత్ కుమార్, నిహారిక, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
పోలా శ్రీధర్, సత్యంన్యూస్.నెట్ కల్వకుర్తి