దుర్గమ్మ ఏడ్చినా… కృష్ణమ్మ కన్నీళ్లు పెట్టినా జగన్ మనసు మాత్రం కరగడం లేదని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. అమరావతి ని కాపాడాలంటూ అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర సందర్భంగా ఆయన సంఘీభావం వ్యక్తం చేశారు.
సోమవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో అమరావతి నుండి అరసవల్లి వరకు రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రలో అయన పాల్గొని సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి ప్రాంత రైతులు భూములు ఇస్తే వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు నిరసనలు చేసుకునే ఖర్మపట్టించారన్నారు.
అమరావతి రైతులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వంచించారని,1000 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి రాజధాని అమరావతి రైతులు బలయ్యారని రావు సుబ్రహ్మణ్యం అన్నారు.కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలతో అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర ను ప్రక్కదోవ పట్టించాలి అనేది ముఖ్యమంత్రి ఉద్దేశ్యం అని తెలుస్తోంది అన్నారు.
పాలనా రాజధాని, న్యాయ రాజధాని అని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా తీసుకుంటారో అర్ధం కావటం లేదు అన్నారు.
నవతరంపార్టీ ఆధ్వర్యంలో అమరావతి ఉద్యమం 450 రోజుల సందర్భంగా చేపట్టిన రాజధాని అమరావతి సాధనా యాత్ర ఇచ్చాపురంలో,శ్రీకాకుళం,అరసవల్లి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నిర్వహించినపుడు ప్రజల్లో మంచి స్పందన లభించింది అన్నారు.
ఇచ్చాపురంలో శాసనసభ్యులు బెందాలం అశోక్, అరసవల్లిలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి నవతరంపార్టీ ఏర్పాటు చేసిన రాజధాని అమరావతి సాధనా యాత్ర రథాన్ని ప్రారంభించి ఉత్తరాంధ్ర నుండి మద్దతు తెలిసిన విషయాన్ని 1000 రోజుల పాదయాత్ర సందర్భంగా గుర్తు చేశారు.
న్యాయస్థానం నుండి దేవస్థానం వరకూ చేపట్టిన యాత్ర మాదిరిగా నేడు చేపట్టిన అమరావతి నుండి అరసవల్లి వరకు యాత్ర విజయవంతం అవుతుంది అన్నారు.పాదయాత్ర లో నవతరంపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకూరి కవిత,యువత నాయకులు వి సాయి ,సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.