తనను పదవి నుంచి తప్పించడానికి భారత్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నదని నేపాల్ ప్రధాని కె పి శర్మ ఓలి తీవ్రంగా ఆరోపించారు. తన రాజకీయ ప్రత్యర్థులకు భారత్ పూర్తిగా మద్దతు ఇస్తున్నదని ఆయన అన్నారు. తనపై ఎన్ని కుట్రలు పన్నినా భారత్ విజయం సాధించలేదని ఆయన అన్నారు. భారత రాయబార కార్యాలయాలలో, ప్రముఖ హోటళ్లలో ఎన్నో విషయాలు చాపకింద నీరులా జరుగుతున్నాయని ఓలి తెలిపారు.
భారత్ కు చెందిన లిపులేక్ పర్వాతచరియలు, కాలాపానీ, లింపియాదురా ప్రాంతాలను తమ దేశంలో కలుపుకుంటూ ఇటీవల నేపాల్ కొత్త మ్యాప్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలో తనను పదవి నుంచి దించడానికి భారత్ ప్రయత్నిస్తున్నదని నేపాల్ ప్రధాని చేసిన ఆరోపణ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నేపాల్ ప్రధానికి ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ చైర్ పర్సన్ కు మధ్య ఇటీవల తీవ్ర విభేదాలు తలెత్తాయి.