రాష్ట్రాన్ని మూడున్నరేళ్ళల్లో అప్పుల కుప్పగా మార్చి, రాజధాని లేని రాష్ట్రంగా చేసిన వైకాపా ప్రభుత్వం ఏపీని మళ్లీ తెలంగాణలో కలిపితే, ఉమ్మడి ఏపీని స్వాగతిస్తాం, విభజన బిల్లును వెనక్కి తీసుకుంటే సంతోషిస్తాం అంటూ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య మండిపడ్డారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఎపీ విభజనపై సజ్జల చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. ఆడ లేక మదెల ఓడు అన్నట్లు అధికారంలోకి రాగానే ఏపీ ఆస్తుల్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధారాదత్తం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి ఎపీ కి రావాల్సిన లక్ష కోట్ల ఆస్తుల పంపకాన్ని ఏం చేశారు? అని ప్రశ్నించారు. విభజన హామీలైన ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని నిధులు, వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు వంటి అన్ని అంశాలపై మడెం తిప్పారని ఆరోపించారు.
నాటి విభజన పర్వంలో ఆర్టికల్ 3 ద్వారా కేంద్రం విభజన నిర్ణయం తీసుకోవచ్చని సలహా ఇస్తూ లేఖ ఇచ్చిన విషయాన్ని మరిచిపోయారా? అని నిగ్గదీశారు. రెండు రాష్ట్రాలను కలపటం దేవుడెరుగు , దమ్ముంటే ఏపీలో ఉన్న అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ని, తెలంగాణలో ఉన్న చెల్లి వైయస్ షర్మిలను కలపాలని, షర్మిలను పరామర్శించాలని సజ్జలకు సూచించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు న్యాయం చేయటం ప్రభుత్వ విధానం కాదా?అని పేర్కొన్నారు.
వైఎస్ కుటుంబాన్ని కలప లేని మీరు రెండు రాష్ట్రాలను ఎలా కలుపుతారని సజ్జల ప్రశ్నించారు. విభజన పై కొంగర మల్లయ్య లా మాట్లాడే ఉండవల్లి అరుణ్ కుమార్ వల్ల ఏపీకి ఒరిగింది ఏమీ లేదని, ఆయన పేపర్ పులి మాత్రమే అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బాగోగులను మరిచి విభజనపై ప్రజల దృష్టి మరల్చేందుకు కొత్త నాటకానికి తెర తీయొద్దని బాలకోటయ్య సజ్జలకు సూచించారు.