ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో వాహనాలు వెళ్లేందుకు వీలైన రోడ్డు నిర్మించిన ఘనత భారత్ సొంతం చేసుకున్నది. సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తున తూర్పు లద్దాక్ ప్రాంతంలోని ఉమ్ లిగ్లా ప్రాంతంలో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది.
ఈ ప్రాంతంలో సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ (బిఆర్ఓ) 52 కిలోమీటర్ల మేరకు ఈ రోడ్డు నిర్మించింది. తూర్పు లద్దాక్ ప్రాంతాన్ని ఈ రోడ్డు చుమ్మార్ సెక్టార్ తో అనుసంధానం చేస్తుంది. ఈ రహదారి నిర్మాణం అక్కడి ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భారత సైనికాధికారులు తెలిపారు.
లేహ్ ప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి పరచేందుకు కూడా ఈ రోడ్డు ఉపకరిస్తుందని భారత సైనికాధికారులు వివరించారు.
ఈ ప్రాంతంలో శీతాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీలకు చేరుతుంది. ఆక్సిజన్ స్థాయి కూడా పడిపోతుంది. ఇంతటి క్లిష్టమైన పరిస్థితులలో ఉండే ప్రాంతంలో రోడ్డు నిర్మించడం అదీ కూడా అతి ఎత్తైన ప్రదేశం కావడం గమనార్హం.