కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలో పత్రికలన్నీ మూతపడుతున్నాయి. డిజిటల్ మీడియా సక్రమంగా నడుస్తుందేమో అనుకుంటున్న సమయంలో పోలీసు కేసులు చీకాకు పెడుతున్నాయి. దేశంలో జర్నలిస్టులకు గోడదెబ్బ చెంపదెబ్బ లాగా రెండు వైపులా నష్టం జరుగుతూనే ఉంది.
ఎవరూ రిట్రెంచ్ మెంట్ కు పాల్పడవద్దని ప్రధాని మోడీ చెబుతున్నా పత్రికలు మాత్రం జర్నలిస్టులను తీసేస్తూనే ఉన్నాయి. న్యూస్ నేషన్ తన ఇంగ్లీష్ డిజిటల్ టీం మొత్తాన్నీ తీసేసింది. టైమ్స్ ఆఫ్ ఇండియా తన సండే విభాగం మొత్తాన్ని తీసేసింది.
మహారాష్ట్రలో అత్యధిక సర్క్యులేషన్ గల సకాల్ టైమ్స్ ఇప్పటి వరకూ 15 మంది జర్నలిస్టులను తీసేసింది. క్వెంట్ న్యూస్ సైట్ మొత్తం 45 మంది జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి ఊడబెరికింది. ముంబయిలోని హమారా మహానగర్ అనే హిందీ పత్రిక మార్చి 18 నుంచి పేపర్ నే మూసేసింది. అదే విధంగా అవుట్ లుక్ మేగజైన్, అదే సంస్థ నుంచి వెలువడే నయీ దునియా మాతపడ్డాయి. ఇండియన్ ఎక్స్ ప్రెస్, బిజినెస్ స్టాండర్డ్ పత్రికలు తమ ఉద్యోగుల జీతాలకు కోత విధించింది. బ్లూంబర్గ్ క్వింట్ వారు జీతాలు ఇవ్వలేమని చెప్పారు.