సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యానాథ్ దాస్ తదుపరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారని తెలిసింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్నీ ఈ నెల 31న పదవీ విరమణ చేయబోతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జూన్ 30నే నీలం సాహ్నీ పదవి విరమణ చేయాల్సి ఉండగా ఆమె పదవి కాలాన్ని మూడు నెలలు పొడిగించాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు.
ఆ తర్వాత మళ్లీ మరో మూడు నెలల పాటు ఆమె పదవి కాలాన్ని పొడిగించారు. రెండో సారి చేసిన పొడిగింపు తర్వాత ఇక ఆమెను కొనసాగించే వీలు లేనందున నూతన చీఫ్ సెక్రటరీ ఎంపిక అనివార్యమైంది. ఇందులో భాగంగానే ఆదిత్యానాథ్ దాస్ ఎంపిక అనివార్యం అయింది.
హిందూ బెనారస్ విశ్వ విద్యాలయంలో డిగ్రి చదివిన ఆదిత్యానాథ్ దాస్ జేఎన్ యులో ఎంఏ ఇంటర్నేషనల్ స్టడీస్ చదివారు. ఆ తర్వాత 1987లో ఐఏఎస్ గా ఎంపిక అయ్యారు. ముందుగా విజయనగరం, విజయవాడలలో అసిస్టెంట్ కలెక్టర్ గా పని చేసిన ఆయన ఈశాన్య రాష్ట్రాలలో కొంత కాలం పని చేశారు.
ఆదిత్యానాథ్ దాస్ 2013లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వచ్చిన క్విడ్ ప్రో కో కేసుల్లో సహనిందితుడుగా ఉన్నారు. వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి లాభం చేకూర్చే విధంగా ఆదిత్యానాథ్ దాస్ వ్యవహరించారని సీబీఐ ఆరోపణలు చేసింది.
2004-2009 మధ్య కాలంలో ఆయన తీవ్ర అధికార దుర్వినియోగం చేసి జగన్ కు మేలు చేశారనేది కూడా సీబీఐ ఆరోపణ. అయితే తనను ఈ ఆరోపణల నుంచి విముక్తుడిని చేయాలని ఆదిత్యానాథ్ దాస్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా అందుకు హైకోర్టు అనుమతించింది.