28.7 C
Hyderabad
April 28, 2024 08: 55 AM
Slider ముఖ్యంశాలు

రేపటి నుండి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం నుండి నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై పోరాటంలో భాగంగా ఆమె ఈ కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు పెట్టారని, అసత్య ఆరోపణలతో జైల్లో పెట్టారనే విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి పోరాటాన్ని ఉదృతం చేసేందుకు నిజం గెలవాలి పేరిట కార్యక్రమాన్ని చేపట్టారు.

నేటికి 46 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబుకు మద్ధతుగా రోడ్డెక్కిన ప్రజలకు, ఆయా వర్గాల వారికి ఆమె ధన్యవాదాలు తెలుపనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ధైర్యం చెప్పడంతో పాటు అండగా ఉంటామంటూ భరోసా ఇవ్వనున్నారు.

తొలిరోజైన బుధవారం చంద్రగిరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొంటారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆవేదన చెంది పాకాల మండలం, నేండ్రగుంట గ్రామానికి చెందిన కె.చిన్నబ్బ సెప్టెంబర్ 25న, చంద్రగిరికి చెందిన ఎ.ప్రవీణ్ రెడ్డి ఈ నెల 17న ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలను భువనేశ్వరి రేపు పరామర్శిస్తారు. పరామర్శ అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ అగరాలలో చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు భాగస్వాములు కానున్నారు. అలాగే గురువారం తిరుపతి, శుక్రవారం శ్రీకాళ హస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీకాళ హస్తిలో పలు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు. శ్రీవారిని దర్శించుకున్న భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం తిరుపతి వచ్చిన భువనేశ్వరి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

10 గంటలకు శ్రీవారి దర్శనం అనంతరం నేరుగా నారావారిపల్లికి వెళ్లారు. నారావారిపల్లెలో గంగమ్మ, నాగాలమ్మ దేవతలకు పూజలు నిర్వహించారు. అత్తమామలు కర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద నివాళుర్పించారు. ఈ సందర్భంగా నారావారిపల్లి గ్రామస్తులు భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్టు తమను ఎంతో బాధించిందన్నారు. రానున్న రోజుల్లో అంతా మంచే జరుగుతుందని, ధైర్యంగా ఉండాలని భువనేశ్వరికి సూచించారు.

ఎప్పుడూ కుటుంబ సభ్యులు, భర్త చంద్రబాబు నాయుడుతో కలిసి నారావారిపల్లెకు వచ్చే భువనేశ్వరి ఈసారి ఒంటరిగా గ్రామానికి రావడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు జైల్లో ఉండగా ఇలా ఒంటరిగా నారావారిపల్లెకు వచ్చిన భువనేశ్వరిలో బాధను చూసిన గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

పేదలకు బియ్యం, పప్పు పంచిన కార్పొరేటర్ శ్రీదేవి

Satyam NEWS

కేటీఆర్ ఐటీ హబ్:వరంగల్‌లో మరో ఐటీ కంపెనీ

Satyam NEWS

ప్రభుత్వ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment