కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో బయానాలు ఇచ్చి కొనుగోలు చేసిన ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ తుమ్మెటి సమ్మిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్ నేతలకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం మీకోసం:
ప్రగతి భవన్ స్క్రిప్ట్ చదివే నేతలారా.. ఒక్క సారి ఆలోచించండి
ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే పదవికి, పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు. అది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. మరి మీరు చేస్తున్నదేమిటి? ఎవరి ఆత్మగౌరవం మీద దాడి ? ఈటల రాజీనామా అనంతరం వెనువెంటనే ప్రగతి భవన్ నుండి అందిన స్క్రిప్ట్ ను ఎస్సీ , బిసి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేత చదివించి ప్రగతి భవన్ ‘దొరలు’ చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టించి వేడుక చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
మీరేమో బడుగు బలహీన వర్గానికి చెందిన ఈటల పై పోటీ పడి అతడిని శూలాలతో గుచ్చుతున్నారు. మంత్రులు గంగుల, కొప్పుల KCR దగ్గర మార్కులు కొట్టేసేందుకు పడరాని పాట్లు పడ్డారు. పల్లా దందాలు బయట పడకుండా వుండేందుకు అతను పోటీ పరీక్షలకు ఫుల్లుగా ప్రిపేర్ అయి వచ్చి తన నోటి దురుసును ప్రదర్శించారు.
అతని పక్కనున్న బలహీన వర్గాల నేతలు స్క్రిప్టుకు రక్తి కట్టించారు. మరి దొరలు ఎవరి మీద ప్రెస్ మీట్ పెట్టించారు? ఎవరి రాజకీయ అణచివేతకు పూనుకున్నారు? మన భుజాలపై తుపాకీ పెట్టి ఎవరిని బలి చేయిస్తున్నారు ? అనే సోయి లేకుండా ఎడాపెడా మాట్లాడి బడుగుల ఆత్మగౌరవాన్ని కించ పరుస్తున్నారు.
నిన్నటి ప్రెస్ మీట్ లలో ఒక్క దొరయైన మాట్లాడిండా లేదు. మరి మాట్లాడే ముందు మనమెవరిమి? ఎవరి మీద మాట్లాడుతున్నాము అనే కనీస అవగాహన మీకు ఉండాలా వద్దా?. అసలేమిటో , వాస్తవమేమిటో మీ అంతరాత్మకు తెలుసు. మరెందుకో అంతా ప్రగతి భవన్ గడికి బానిసలయ్యారు, ఎందుకు అవుతున్నారు, ఈటల రాజేందర్ గారు ఎలాంటి కబ్జాలు చేయలేదని KCR అతని కుటుంబ సభ్యులకు తెలుసు, కానీ భవిష్యత్తులో అట్టడుగు వర్గాలకు చెందిన నేతలు సమాన స్థాయికి ఎదగవద్దనేది కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల అంతరంగ రహస్యం.
కొందరు పదవుల కోసం, కొందరు డబ్బుల కోసం, కొందరు తమ తప్పిదాల నుండి తప్పించుకోవడానికి, కొందరు భయంతో ప్రెస్ మీట్లు పెట్టి ఆత్మవంచన చేసుకుంటున్నారు. తప్పు చేయని నిప్పు లాంటి ఈటలపై భూ కబ్జా నెపం మోపి అది నిజమని జనాన్ని నమ్మించేందుకు చేసిన కుట్రలో బడుగు నేతలను పావులుగా వాడుకుంటున్నారు.
కుట్ర పూరితంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిసి కూడా ఖండించలేని దుస్థితి లో ఎమ్మెల్యేలు, మంత్రులు వుండడం సిగ్గుచేటు. ఇది ఒక్క ఈటల రాజేందర్ పై జరుగుతున్న దాడి కాదు అది రేపు మీకు కూడా వర్తిస్తుంది.
అధినేత మెప్పు కోసం మీరు వేస్తున్న కుప్పి గంతులు మిమ్మల్ని బానిసత్వం లోకి నెట్టబడుతున్నాయని తెలిసినా క్రూరంగా మాటలతో తూట్లు పొడుస్తున్న మీ పైశాచికత్వాన్ని యావత్ తెలంగాణా ప్రజానీకం గమనిస్తున్నారు. సర్వ తప్పులు చేసిన మీరు ఈటలపై ఎదురుదాడికి దిగితే మీ అంతరాత్మ ఘోషిస్తుంది. ఈటల సొమ్ము తిన్నోడు, అతడితో ఎదిగినోడు, పదవులు అనుభవిస్తున్న వారు విమర్శిస్తుంటే సభ్య సమాజం సిగ్గు పడుతుంది.
హుజూరాబాద్ నియోజకవర్గంలో 98 శాతం మంది ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ వైపు ఉన్నారని చెప్తున్న నేతలకు సవాలు విసురుతున్నాము.. హరీష్ రావు, వినోద్ రావు, గంగుల కమలాకర్ మీరందరూ బయానాలు ఇచ్చి కొనుగోలు చేసిన ప్రజాప్రతినిధులను దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవమని డిమాండ్ చేస్తున్నాము.
Mptc, zptc, మున్సిపల్ కౌన్సిలర్స్ కి ఈటల నే టిఆర్ఎస్ బీ ఫారం ఇవ్వడంతో పాటు దగ్గర ఉండి గెలిపించారు. ఇది వాస్తవం అని గెలిచిన వారందరికీ తెలుసు. ఈ రోజు ఈటల రాజీనామా చేసి ప్రజాక్షేత్రం లోకి వస్తున్నారు. అంతకంటే ముందు మీరు రాజీనామా చేసి హరీష్ రావు, వినోద్ రావు, గంగుల కమలాకర్ ఫోటో లు పెట్టుకొని గెలవండి. ఆ తరువాత మాత్రమే ఈటల ను రాజీనామా చేయాలి అని అడిగే అర్హత మీకు ఉంటుంది.
తుమ్మెటి సమ్మిరెడ్డి
జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్