ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం రద్దు చేయాలని, పాలమూరు-రంగా రెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారంనాడు వాదనలు విననున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పిలిచిన టెండర్లను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి లోబడి రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించినట్లు వంశీచంద్ రెడ్డి తెలిపారు. చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ జస్టిస్ బి. విజయసేనా రెడ్డితో కూడిన 1వ నెంబర్ ధర్మాసనం ఎదుటకు ఈ కేసు వస్తున్నదని ఆయన తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 5 ఎకరాల పొలంలో కృష్ణా జలాల ఆధారంగా వ్యవసాయం చేసే రైతుగా జులై 25న హైకోర్టులో రిట్ పిటిషన్ రూపంలో వంశీచంద్ రెడ్డి కేసు దాఖలు చేశారు.
కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, శ్రీశైలం ఎడమ కాలువ, అలిమినేటి మాధవరెడ్డి ప్రోజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి జులై 15న పిలిచిన No.1SE/2020-21 టెండర్లు కేంద్ర జలాశక్తి మంత్రిత్వ శాఖ జులై 1న F.No. 2/04/2020/KRMB/1502-1505 ద్వారా ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధం అని ఆయన పేర్కొన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం రద్దుతో పాటు పాలమూరు-రంగా రెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను ఒక సంవత్సరం లోపు పూర్తిచేసేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు.