పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్ళకు పోలీస్ శాఖ తరపున పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు. శ్రీ త్రికోటేశ్వర స్వామి భక్తులకు భద్రతా పరంగా, ట్రాఫిక్ పరంగా సమస్యలు తలెత్తకుండా తగినంత మంది పోలీసులతో బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. తిరునాళ్లకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పోలీస్ శాఖ తరపున తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగనున్న కోటప్పకొండ తిరునాళ్లకు సంబంధించి పోలీస్ శాఖ తరపున చేయవలసిన భద్రత ఏర్పాట్ల నిమిత్తం పోలీస్ అధికారులతో కలసి కోటప్పకొండ పరిసరాలను ఎస్పీ నేడు పరిశీలించారు. కోటప్పకొండ పరిసరాలను, కొండకు పోవు మార్గాలను, ప్రభలు వచ్చు మార్గాలను ,ప్రభలు నిలుపు మార్గాలను పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించి,చేయవలసిన భద్రత ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించారు.
తిరునాళ్ల రోజు దేవుని దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్దఎత్తున విచ్చేస్తారు కావున ఆ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం ముఖ్యంగా ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఇతర శాఖల అధికారులు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కొండకు వెళ్లే మార్గాల్లోఎటువంటి అడ్డంకులు లేకుండా సంబంధిత అధికారులను రోడ్ల మరమ్మత్తులు మరియు విస్తరణ పనులు చేయవలసినదిగా కోరామని, దీనివలన ట్రాఫిక్ మీద ఉన్న ఒత్తిడి తగ్గి, వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) G. బిందుమాధవ్, జిల్లా అదనపు ఎస్పీ(ఏఆర్) రామచంద్ర రాజు, నరసరావుపేట డిఎస్పీ విజయ భాస్కర్, ఏఆర్ డిఎస్పీ చిన్నికృష్ణ, ఎస్బి సీఐ ప్రభాకర్, నరసరావుపేట రూరల్ సీఐ భక్తవత్సల రెడ్డి, చిలకలూరిపేట రూరల్ సీఐ అచ్చయ్య, ఎస్సైలు బలనాగిరెడ్డి, రాజేష్ పాల్గొన్నారు.