గాలిలోకి పోలీసుల కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత
పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేత జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసు ఎత్తేయాలని కార్యకర్తలు ర్యాలీ నిర్వహించగా.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎదురుపడ్డారు. కారు దిగి టీడీపీ నాయకులపై సవాల్ విసరగా… ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టీడీపీ కార్యకర్తలు వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడగా.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసుల లాఠీఛార్జి చేశారు. ఈ క్రమంలో పట్టణ సీఐ సాంబశివరావు గాలిలోకి కాల్పులు జరిపారు.
ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేత జీవీ ఆంజనేయులు నాయకత్వాన.. ఆ పార్టీ కార్యకర్తలు.. అక్రమ తవ్వకాలు జరిగిన భూముల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. కాగా, తన డెయిరీ పరిశ్రమలోకి చొరబడి సామగ్రి ఎత్తుకువెళ్లారని ఆరోపిస్తూ.. టీడీపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే తప్పుడు కేసులు పెట్టించగా… టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు తీవ్రంగా ఖండించారు. తప్పుడు కేసులకు భయపడేదని, ఎమ్మెల్యే మట్టి దోపిడీని బయటపెట్టాననే అక్కసుతో తనపై, తన పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు.
ఎమ్మెల్యే బొల్లా ఆవుల ఫారానికి వెంకుపాలెంలోని సర్వే నెంబర్-1 కొండ పోరంబోకు ప్రభుత్వ భూమి నుంచి వేల ట్రక్కుల మట్టిని తరలించుకు వెళ్లారని ఆరోపించారు. అక్రమ తవ్వకాలు జరిగిన భూముల్లోకి వెళ్లి.. నిరసన చేపట్టి, మీడియాకు చూపించామని.. దీనికి సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే తప్పుడు కేసులు పెట్టించారని ఆగ్రహించారు.