కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నాయకులు నేడు సత్యాగ్రహ దీక్ష చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ట్యాంక్ బండ్ వరకూ ర్యాలీగా వెళ్లాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు.
దీంతో సేవ్ ఇండియా, సేవ్ కానిస్టిట్యూషన్ నినాదంతో గాంధీభవన్లోనే సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్, ఎంఐఎం ర్యాలీలు, సభలకు మద్దతిచ్చిన కెసిఆర్, కాంగ్రెస్కు మాత్రం ఎందుకు అనుమతివ్వరని కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఎంఐఎం..టీఆరెస్ పార్టీలు బిజెపి కి మద్దతు పలుకుతున్నాయని ఆయన అన్నారు. కెసిఆర్ వైఖరి ని జనం ముందు పెడతామన్నారు.
టాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీ గా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ‘తిరంగ ర్యాలీ’ కి పోలీసులు అనుమతి నిరాకరణ నేపథ్యంలో గాంధీ భవన్ కు వెళుతున్న కాంగ్రెస్ కార్యకర్తల డీసీఎంను ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను రాంగోపాల్ పేట్, నారాయణ గూడ పోలీస్ స్టేషన్ల కు తరలించారు. గాంధీ భవన్ ముందు.. పోలీసులతో సీఎల్పీ భట్టి వాగ్వివాదానికి దిగారు. ఆర్ఎస్ఎస్ ర్యాలీ నిర్వహిస్తే అనుమతి ఇచ్చారని సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీకి మాత్రం అనుమతి ఇవ్వడం లేదని సీఎల్పీ భట్టి వాపోయారు.