విశాఖలో సివిల్ వివాదాల్లో తలదూర్చి సెటిల్ మెంట్లకు పాల్పడుతున్న పలు పోలీస్ స్టేషన్లకు సంబంధించి కొంత మంది అధికారులు, సిబ్బందిపై వేటుకు నగర కమీషనర్ సిద్ధమవుతునట్లు తెలుస్తోంది. గత నెల రోజులుగా పలు పోలీస్ స్టేషన్లో జరుగుతున్న సివిల్ తగవుల సెటిల్మెంట్ల పై కమీషనర్ కు ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు అందినట్లుగా సమాచారం. ఇటీవల నగర శివారు ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో సివిల్ దందాలకు పాల్పడుతున్న కొంతమంది అధికారులపై వేటుకు సిద్ధం చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం.
ఇటీవల కాలంలో సివిల్ తగవుల విషయంలో పోలీసుల ఒత్తిడితో ఇబ్బంది పడి నష్టపోయిన బాధితులకు ఊరట కలిగించాలని యంత్రాంగం భావిస్తోంది. పోలీసు స్టేషన్లలో సివిల్ తగాదాలు సెటిల్ చేసినట్లయితే బాధితులు తక్షణమే విశాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లయితే న్యాయం జరిగే అవకాశం ఉంది. బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యంత్రాంగం భావిస్తోంది. నగరంలో భూ తగాదాలలో పోలీసుల జోక్యాన్ని నివారించాలని పోలీసు బాస్ పట్టుదలతో వున్నారు.
ఇప్పటికే సెటిల్ మెంట్ ‘కింగ్‘ల జాబితాను సిద్ధం చేసిన పోలీసు యంత్రాంగం వారిపై వేటుకు కమీషనర్ ఆదేశాల కొరకు ఎదురు చూస్తోంది. కాగా ఇదివరకే పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేసిన బాధితులతో బాటు పోలీసుల వలన ఇబ్బందులకు గురయిన వారు నేరుగా నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసి ఉపశమనం పొందే అవకాశం ఉంది. విశాఖ నగరంపై భూ మాఫియా పడగ నేపధ్యంలో ప్రభుత్వం భూ అక్రమాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. మరికొన్ని రోజులలో విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించాలని సీఎం జగన్ భావిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. ముందుగా పోలీసుస్టేషన్ లను ప్రక్షాళన చెయ్యాలని భావిస్తున్న పాలకుల ఆదేశానుసారం పోలీస్ బాస్ సివిల్ సెటిల్మెంట్ లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.