11వ PRC కమిటీ చైర్మన్ బిశ్వాల్ సూచించిన విధంగా మున్సిపల్ కార్మికులకు మూడు కేటగిరీలుగా కనీస వేతనం ఇవ్వాలని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి డిమాండ్ చేశారు. PRC కమిటీ చెప్పిన ప్రకారం 19000, 22900, 31040 రూపాయలు ఉండాలని అయితే ప్రభుత్వం తగ్గించి 15600, 19500,32750 మాత్రమే అమలు చేస్తున్నదని ఆయన అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నేడు నిరసన ధర్నా చేసిన అనంతరం కమిషనర్ సతీష్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం రోషపతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లాక్ డౌను సమయంలో ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా ఉద్యోగ,కార్మికులు విధులను నిర్వర్తిస్తున్నారని అన్నారు.
అయితే సీఎం కెసిఆర్ ఈ కార్మికులకి ఇచ్చే బహుమతి ఇదేనా? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు,చదువుకున్న ప్రతి ఒక్కరు ఈ విచిత్ర పరిపాలన చూస్తున్నారని, కార్మికవర్గం తిరుగుబాటు చేయకముందే తక్షణమే జీవో నెంబర్ 60 సవరణ చేసి కేటగిరీల వారీగా జూన్ 2021 నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సి ఐ టి యు అనుబంధ సంఘ అధ్యక్ష్య, కార్యదర్శులు ముత్తమ్మ, మెరిగ దుర్గారావు, కె.సైదులు, వి.శ్రీను, దేవకర్ణ,చంద్రమ్మ, సైదులు,చంటి,పంగ సాయి,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.