మత్స్యకారుల సమస్యలపై అత్యున్నత చట్టసభలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి గళమెత్తారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపాలని తిరుపతి ఎంపీ లోక్సభలో గట్టిగా డిమాండ్ చేశారు. వేటాడితే గానీ డొక్కాడని బతుకులు మత్స్యకారులవని ఆయన లోక్సభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
మత్స్యకారులు చేపల వేట సమయంలో భారత్, శ్రీలంక మధ్య సముద్రంలో తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనల్లో మత్స్యకారులు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాల్లో శోకాలు నింపుతున్న వివాదాలకు ముగింపు పలకాలని ఆయన కోరారు. సముద్రంలో లోతైన ప్రాంతాల్లో చేపల వేట కొనసాగేందుకు అవకాశం కల్పిస్తే తీర ప్రాంతాల్లోని మత్స్యకారుల జీవితాల్లో కాంతిరేఖలు నింపిన వారవుతారని చెప్పుకొచ్చారు. ఇందుకు ఆసరాగా “డీప్ సీ ఫిషింగ్” పథకం నిలవనుందని ఆయన అన్నారు.
లోక్సభ సమావేశాల్లో భాగంగా ఆయన మత్స్యకారులకు సంబంధించి కీలకమైన ప్రశ్నలు సంధించారు. ట్రాలర్ల స్థానంలో సముద్రంలో లోతైన ప్రాంతంలో చేపలను వేటాడేందుకు 2వేల “డీప్ సీ ఫిషింగ్ బోట్స్” అందించేందుకు ప్రవేశపెట్టిన “డీప్ సీ ఫిషింగ్ పథకం” సాధించిన పురోగతి వివరాలు వెల్లడించాలని, అలాగే రాష్ట్రాల వారీగా ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందా? అని ఆయన ప్రశ్నించారు.
తిరుపతి ఎంపీ ప్రశ్నకు కేంద్ర మత్స్యశాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాల సమాధానం ఇస్తూ… తమ శాఖ “బ్లూ రివల్యూషన్పై గతంలో కేంద్ర ప్రాయోజిత పథకం (CSS) కింద 2015-16 నుంచి 2019-20 మధ్య కాలంలో అమలు చేసిన సమీకృత అభివృద్ధి , మత్స్య నిర్వహణ” వివిధ సముద్ర తీర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను ఆమోదించినట్టు చెప్పారు.
అందులో భాగంగా సంప్రదాయ మత్స్యకారుల కోసం మొత్తం 918 డీప్-సీ ఫిషింగ్ ఓడల కొనుగోలుకు మొత్తం రూ.73,440 లక్షలు అంచనా విలువ కాగా కేంద్ర సహాయం రూ.312.09 కోట్లు నిధులు విడుదల చేసినట్టు మంత్రి వివరాలు వెల్లడించారు.
సంప్రదాయ మత్స్యకారుల కోసం, డీప్-సీ ఫిషింగ్ మద్దతు కోసం కొనసాగుతున్న ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద కొనసాగించినట్టు మంత్రి చెప్పారు. అలాగే “బ్లూ రివల్యూషన్ లో భాగంగా 2017 నుంచి 2020 వరకు తమిళనాడులో 750 బోట్ల కొనుగోలుకు రూ.600 కోట్ల ప్రాజెక్ట్ అంచనా కాగా రూ.281.5 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర మత్స్యశాఖ మంత్రి తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 12 బోట్ల కొనుగోలుకు రూ.9.6 కోట్ల ప్రాజెక్ట్ అంచనా కాగా రూ.2.33 కోట్లు విడుదల చేశామన్నారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద డీప్ సీ ఫిషింగ్ బోట్లకు తమిళనాడులో 50 బోట్ల కొనుగోలుకు రూ.60 కోట్ల ప్రాజెక్ట్ అంచనా కాగా రూ.17.28 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో 50 బోట్ల కొనుగోలుకు రూ.60 కోట్ల ప్రాజెక్ట్ అంచనా కాగా రూ.15.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్టు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.