‘‘భారత దేశాన్ని ఎట్టిపరిస్థితుల్లో తల దించుకునేలా చేయను’’ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు గుర్తుందా? అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.
అరుణాచల్ ప్రదేశ్ లో భారత సరిహద్దుకు 4.5 కిలోమీటర్లు లోపల చైనా ఏకంగా సుమారు 100 ఇండ్లతో గ్రామాన్ని నిర్మించింది అనే వార్తలపై స్పందిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై ట్విట్ పెట్టారు.
ఇదేనా తల ఎత్తుకునేలా చేసే పని అని ఆయన ప్రశ్నించారు. మోడీజీ మీ 56 అంగుళాల ఛాతీ ఏమైంది అంటూ కాంగ్రెస్ నాయకులు రణదీప్ సుర్జేవాలా, మనీష్ తివారీలు ప్రశ్నల వర్షం గుప్పించారు.
భారత భూభాగాన్ని ఆక్రమిస్తూ చైనా నిర్మాణాలు చేస్తున్నదని నవంబర్ లో అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ తపెర్ గావో హెచ్చరించినట్టుగానే జరిగింది. గ్రామ నిర్మాణం నవంబర్ 2020 లోనే చైనా పూర్తి చేసింది.
సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా మ్యాప్ ప్రకారం చూసినా కూడా ఈ గ్రామ నిర్మాణం ఇండియా భూభాగం లో ఉంది. బీజేపీ ఎంపీ చెబుతున్నా ఎందుకు పట్టించుకోలేదు అనేది ప్రధాన ప్రశ్న.
దీనిపై కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీని ఎండగడుతున్నది. తీవ్రంగా విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి.