లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ, వ్యాపారవేత్త గౌతమ్ అదానీలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల వాడి తీవ్రత తగ్గడం లేదు. ఈ వ్యవహారంలో బీజేపీ సభ్యులు సమర్పించిన ప్రివిలేజ్ నోటీసులపై రాహుల్ గాంధీ లోక్సభ సెక్రటేరియట్కు సవివరంగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఫిబ్రవరి 7న రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మోదీపై వ్యాఖ్యలు చేశారు. వ్యాపారవేత్త గౌతమ్ అదానీతో మోదీ సంబంధాలపై కూడా చాలా ఆరోపణలు చేశారు.
దీని తరువాత, బిజెపి ఎంపీలు నిషికాంత్ దూబే, ప్రహ్లాద్ జోషి రాహుల్ గాందీపై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. దానికి లోక్సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీని ఫిబ్రవరి 15 లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. రాహుల్ గాంధీ లోక్సభలో తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు పలు చట్టాలను ఉదహరించి, అనేక పేజీల ప్రత్యుత్తరాన్ని దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సోమవారం నాడు, తన లోక్సభ నియోజకవర్గం వాయనాడ్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ, రాహుల్ గాంధీ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. లోక్సభలో తన ప్రసంగంలోని కొన్ని భాగాలను రికార్డు నుండి తొలగించే నిర్ణయాన్ని కూడా ఆయన విమర్శించారు. పార్లమెంటులో తాను ఎలాంటి కించపరిచే పదజాలం ఉపయోగించలేదని రాహుల్ గాంధీ అన్నారు.