ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎంపిక అయిన రాష్ట్ర మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలు ఈ నెల 22 బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరు ఇద్దరూ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో వెళ్లి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.
వీరితో పాటు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు గా ఎన్నికయిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు పరిమల్ నత్వాని, ఆళ్ల అయోధ్య రామిరెడ్డిలు కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరంతా గత నెల 19న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.
దేశవ్యాప్తంగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో విజేతలందరూ 22న ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఏపీ నుంచి ఎన్నికయిన సభ్యులు అందరూ అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.