పన్నుల పెంపుదలతో జనాన్ని బాదడంలో దేశంలోనే రికార్డు సృష్టించిన జగన్ సర్కార్ జూన్ ఒకటి నుంచి మరో బాదుడు కార్యక్రమం మొదలు పెట్టనుంది. రాష్ట్రంలో భూముల విలువ పెంపును భారీగా పెంచనుంది. దీంతో 15 నుండి 20 శాతం వరకు పన్నుల భారం పడనుంది. గత ఏడాది భూమి విలువ పెంచిన కొత్త జిల్లాల్లో తక్కువగా భూముల ధరలను పెంచింది. రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వచ్చే 20 శాతం గ్రామాల్లో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో 30 నుండి 35 శాతం వరకు భూముల విలువ పెరగనుంది. జూన్ 1వ తేదీ నుండి భూముల విలువ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో గత రెండు మూడు రోజులుగా రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ల కోసం పెద్ద ఎత్తున ధరఖాస్తులు వస్తున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యలు నెలకొనడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని ప్రభుత్వం పేర్కొంది. రెండు రోజులుగా రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది.
రాష్ట్రంలోని 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో నేటి నుండి మ్యాన్యువల్ గా రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలను పరిష్కరించనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. భూముల ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కూడ పెరగనుంది. స్టాంప్ డ్యూటీ పెరగడంతో భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.