వైఎస్ఆర్ జిల్లా కమలాపురం రెవెన్యూ అధికారుల మొద్దు నిద్ర అక్రమార్కులకు కోట్లాది రూపాయలు తెచ్చే వరమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ మండల పరిధిలోని సరిహద్దులు కూడా తెలియని తహసీల్దారు, మండల రెవెన్యూ సిబ్బంది విధులు నిర్వర్తించడం వారి పనితీరుకు అద్దం పడుతోంది. క్వారీ ఆది నుంచి వివాదాస్పదంగా నడుస్తున్నా ఉన్నతాధికారుల అటువైపు చూసినా దాఖలాలు లేవు. ఎందుకంటే అధికార పార్టీకి నాయకుల అండదండలతోనే క్వారీ నడుస్తోందని అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
వెదురూరు ఇసుక క్వారీ పేరుతో కమలాపురం మండలంలోని విభరాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమంగా కోట్ల రూపాయలు విలువ చేసి ఇసుకను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. గతంలో కూడా పలుమార్లు తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు పుత్తా ఎల్లారెడ్డి ఆందోళన చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఎల్లారెడ్డి సంబంధిత జిల్లా అధికారులందరికీ స్పందనలో ఫిర్యాదు చేశారు కూడా. సంబంధిత అధికారులందరూ మామూళ్ల మత్తులో తూగుతుండడంతోనే ఇంత వ్యవహారం జరుగుతున్నా తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని పుత్తా ఎల్లారెడ్డి ఆరోపించారు. సర్వే చేయవలసిన శాటిలైట్ మిషన్ ప్రభుత్వం రీఛార్జ్ చేయక పనిచేయడం లేదంటూ చేతులెత్తేశారు అధికారులు.