వనపర్తిలో రోడ్ల విస్తరణకు సంపూర్ణంగా సహకరించాలని వనపర్తి టౌన్ టీఅర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి కోరారు. వనపర్తి సమగ్ర అభివృద్ధికి దశాబ్దాలుగా అడ్డుగోడగా నిలిచిన రోడ్ల విస్తరణ సమస్యను తన నాయకత్వ పటిమతో దృఢ సంకల్పాలతో పరిష్కరిస్తూ విస్తరణ చేపట్టిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ప్రజలందరి సహకారము అండదండలు అవసరమని చెప్పారు.
అప్పుడే చేపట్టిన పనులు శీఘ్రగతిన పూర్తవుతాయని, తమ ప్రాంతాల బాగు, తమ జీవన ప్రమాణాల మెరుగు భగవంతుని సంకల్పంగానే భావించి రోడ్ల విస్తరణలో భాగంగా తాము విశ్వసించిన పరమేశ్వరుడు అంతటా ఉంటాడనే నమ్మకంతో తమ ప్రార్థన స్థలాల స్థల మార్పిడి చేయడానికి ముస్లిం సోదరులు, బడుగు బలహీన వర్గాలు అంగీకరించి విస్తరణకు తోడ్పాటు అందించాయన్నారు.
అదేవిధంగా సమాజంలో ఉన్నత వర్గమైన ఆర్య వైశ్య సోదరులు తాము విశ్వసించే జగన్మాత ఒక ప్రదేశానికో ఒక వర్గానికో చెందినది గాక సర్వ జగతిలో తానే ఉంటుందని భావించి స్థల మార్పిడికి అంగీకరించి తమ వ్యాపారాలకు, ఉన్నతికి నెలవై ఉన్న వనపర్తి పట్టణం, బీద బలహీన వర్గాలకు నివసించే ప్రాంతమైన పాత బజారు ఏరియా సమగ్ర అభివృద్ధికి కారణమవుతున్న రోడ్ల వెడల్పు కార్యక్రమానికి సహకరించాలని ఆయన ఆర్యవైశ్యులను కోరారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్