దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, వైకాపాకు ఉపద్రవంగా పరిణమించనుందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. వైకాపాకు జనవరి నాలుగో తేదీ చీకటి రోజుగా మారనుంది. అదే రోజు వైఎస్ షర్మిల కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తోపాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ఆయన తెలిపారు.
మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా వైఎస్ షర్మిల మళ్లీ తిరిగి సొంత రాష్ట్రానికి రానున్నారు. తాను పుట్టింది ఆంధ్ర ప్రదేశ్ లోనే అయినప్పటికీ, తన మెట్టినిల్లు అయిన తెలంగాణ రాష్ట్రంలో పార్టీని స్థాపించిన విషయం తెలిసింది. ఇప్పుడు తన తండ్రిని రాజకీయంగా ఎంతో ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరనున్నారు. చిన్న మనస్పర్ధల వల్ల కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని భావించిన షర్మిల, అన్నను నమ్ముకొని సపోర్టుగా పాదాలు అరిగేలా రెండు ఎన్నికల్లో తిరిగారు. చెల్లెలు కోసం అష్ట,కష్టాలు అనుభవించిన అన్నల గురించి వచ్చిన సినిమాలను ఎన్నో చూశాం.
కానీ అన్న కోసం అష్ట కష్టాలు పడిన చెల్లెలు గురించి వచ్చిన సినిమాలు చూడలేదు. కానీ ప్రత్యక్షంగా ఒక అన్న కోసం చెల్లి చేసిన త్యాగాలను చూశాం. వన్ వే ట్రాఫిక్ మాదిరిగా అన్న కోసం చెల్లి త్యాగాలు చేయడమే తప్పితే, అన్నయ్య నుంచి రిటర్న్ గ్రాటిట్యూట్ అన్నది లేకుండా పోయింది. దీనితో తన తండ్రిని రాజకీయంగా ఎంతో ప్రోత్సహించిన, ఆయనకు ఎంతో ఔన్నత్యాన్ని చేకూర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం సంతోషమే. అయినా ఈ విషయము తో నాకు సంబంధం లేకపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం అన్నది వైకాపాకు పెద్ద సెట్ బ్యాక్ కానుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఏరు దాటాక తెప్ప తగిలేయడం అనే నానుడిని అక్షరాలా నిజం చేస్తూ… గొడ్డు చాకిరీ చేసిన చెల్లిని వదిలేశారు. చెల్లి తో పాటు తల్లిని కూడా వదిలేసిన వారికి,నేను, నాలాంటి వారు పెద్ద లెక్కే కాదు. సహాయం చేసిన కొందరిని దండించారు. సహాయం చేసి దండన పొందిన వారిలో నాతో పాటు మరికొందరు ఉన్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తొలిసారిగా 1984లో పిసిసి అధ్యక్షునిగా రాజీవ్ గాంధీ నియమించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 2024లో షర్మిల తిరిగి పిసిసి అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నారు. రాజశేఖర్ రెడ్డిని పిన్న వయసులోనే పిసిసి అధ్యక్షునిగా రాజీవ్ గాంధీ నియమించారని, 40 ఏళ్ల తర్వాత ఆయన కుమార్తె కూడా పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలను తీసుకోవడం అనేది యాదృచ్ఛికమే అయినా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వేసిన ఒక మంచి రాజకీయ ఎత్తుగడ అని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.
సొంతగూటికి చేరనున్న కాంగ్రెస్ నేతలు
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలను షర్మిల స్వీకరించిన తర్వాత ఎంతోమంది కాంగ్రెస్ నేతలు సొంతగూటికి చేరే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. వైకాపా నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడం వల్ల సుమారు 40 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వారికి మరొక ప్రత్యామ్నాయం లేదు. టిడిపి, జనసేన పార్టీలలో చేరిన టికెట్ దక్కే అవకాశాలు లేవు. ఎందుకంటే, రెండు పార్టీలలోనూ అభ్యర్థుల ఎంపికపై దాదాపుగా కసరత్తు పూర్తయింది. కాంగ్రెస్ పార్టీకి నిన్న మొన్నటి వరకు సరైన అభ్యర్థులే లేరు.
కానీ, నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏడు శాతం ఓటు బ్యాంకు ను సంపాదించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైకాపాకు దన్ను గా ఉన్న ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ ఓట్లకు పెద్ద బొక్క పడనుంది.. జాతీయస్థాయిలో ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు కారణంగా ముస్లిం మహిళలు మాత్రం బిజెపి వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదు కాబట్టి ముస్లిం మైనారిటీలు జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా నిలిచారు.
ఇక వైకాపా గెలుపులో కీలక పాత్ర పోషించిన క్రిస్టియన్ మైనారిటీలు షర్మిల వైపు చూస్తారనడం లో సందేహం లేదు. షర్మిల భర్త బ్రదర్ అనిల్, గతంలో తన బావ గెలుపు కోసం ఎంతో పని చేశారు. ఆయన ముందుగానే వైకాపా ఎన్ని స్థానాలలో గెలుస్తుందో చెప్పగలిగారు. అన్నీ తెలుసుకున్న బ్రదర్ అనిల్ తన బావ ఆంతర్యాన్ని మాత్రం తెలుసుకో లేక పోయారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారంలో బ్రదర్ అనిల్ కీలక పాత్ర పోషించనున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
రాష్ట్రంలో 20 శాతం ఉన్న క్రిస్టియన్ మైనార్టీలతోపాటు, ముస్లిం మైనార్టీల వెన్నుదన్నుతో కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో కొన్ని స్థానాలలో గెలిచిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం వైకాపాకు పెద్ద యాక్సిడెంట్ వంటి పరిణామమే. జనవరి 4వ తేదీ వైకాపాకు చీకటి రోజే అవుతుంది. 1977 నవంబర్ 19వ తేదీన దివిసీమకు ఉప్పెన వచ్చినట్లుగా, గతంలో డిసెంబర్ 26వ తేదీన సునామీ వచ్చినట్లుగా, వైకాపాకు ఇది కూడా అటువంటి పరిణామమే అవుతుందని రఘు రామకృష్ణంరాజు అన్నారు.
వైకాపా లో టికెట్ దక్కని ఎమ్మెల్యేలు సంతోషంగా, షంషేర్ గా ఉండి కాంగ్రెస్ తరపున ప్రతిష్టాత్మకంగా పోటీ చేసే అవకాశం ఇప్పుడు లభించనుంది. విజయానికి వైకాపా కొన్ని యోజనాల దూరము లో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్జీవం అయిన తర్వాత అనంత విశ్వంలో ఒక గ్రహానికి మరొక గ్రహానికి ఎంత దూరం ఉంటుందో ఎన్నికల్లో విజయానికి వైకాపాకు అంతే దూరంలో ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇప్పటివరకు రానున్న ఎన్నికల్లో వైకాపాకు 30 నుంచి 35 స్థానాలలో గెలిచే అవకాశం ఉందని నేను గతంలో చెప్పాను. నాల్గవ తేదీ తర్వాత కేవలం 20 స్థానాల లోపుకు వైకాపా దిగజారి పోతుందన్నారు. తెలివి తక్కువతనాన్ని ఓటర్ అయినా, నాయకులైన భరిస్తారు. జాలి చూపిస్తారు. అంతే కానీ అహంకారాన్ని మాత్రం ఎవరు తట్టుకోలేరు. అలలు మానిన అభిజాత్యాన్ని, అహంకారాన్ని ప్రదర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డిని భరించే నాయకులకు కానీ, ప్రజలు ఇక రాష్ట్రంలో ఎవరు లేరని రఘురామ కృష్ణంరాజు అన్నారు.