మత్స్యావతారమున శ్రీహరి
సోమకుని వధియించి
వేదరక్షణ చేసి బ్రహ్మకీయ
చైత్ర శుద్ధ పాడ్యమి తిథి లోన
సృష్టి జరిగిన ఈ సుదినంన
వేం చేయవమ్మా..వేగిరమ్ముగ నీవు
నక్షత్ర గమనాల లెక్కింపు లే కాక
వసంత బుుతువు ఆగమన వేళ
యుగాది గా మొదలైన
తెలుగు వత్సరాది సంకేతమైన
ఉగాది సంరంభమా..వేంచేయవమ్మా ..
కరోనా కష్టాల శార్వరీ లోన
జడమైన జగతి కి దుఃఖాన్ని
శిశిరముగ రాల్చి
ఆశల తొడుగులతో
కొత్త చిగురుల వసంతాలు పూయించ
ప్లవ నామ వత్సరమా…వేంచేయవమ్మా .
చైతన్యమే లేక శిలలాగ మారిన
ఈ సర్వ జగతి కి శిల్పి వై
నూతనోత్సాహాల జీవమీయమ్మా
శ్వాసలను బంధిస్తు
ఆత్మీయ స్పర్శ లు మృగ్యమై
ఎండుటాకులైన సర్వ జనుల
స్వేచ్ఛా వాయువుల పర్ణశాలలు చేర్చి
చల్లగా దీవించ వేగ రావమ్మా.
నీలాల నింగి లో నిరాశలన్నిటిని
పతంగాల్లా ఎగురేసే
సంక్రాంతి శోభ నియ్యి
సస్యరమల మా ముంగిళ్ళు నిండ
ఉగాది పచ్చడి ని పోలిన
హరివిల్లు మాకీయ వేగరావమ్మా…
జీవన సంద్రాల ప్లవ వై దాటించ
ఎర్రని మోదుగుల పల్లకీలో
అమాస చీకట్లు తొలగించి
వేపపూ వెన్నెల ను పూయించ
వాసంతి శోభ ల తో వేగ రావమ్మా..
ప్లవ నామ వత్సరమా…
వేం చేయవమ్మా…..
రావుల కిరణ్మయి, హన్మకొండ